హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో కేసీఆర్ కప్ మహిళల రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఘనంగా ముగిశాయి. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఫైనల్స్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన గాదె శరణ్య ఓవరాల్ విజేతగా నిలిచింది. మిగతా విభాగాల్లో దీక్షిత, క్రితిక, అభిరామి, రేణుక, జ్ఞానత, విజేత, షరిష్మా నగదు ప్రోత్సాహకాలు అందుకున్నారు. ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా యూత్గేమ్స్లో పతకాలు సాధించిన ప్లేయర్లతో పాటు అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు క్రికెటర్లు త్రిష, యశశ్రీని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘తెలంగాణ ప్లేయర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఆశయంతో సీఎం కేసీఆర్ నగదు ప్రోత్సాహకాలను భారీగా పెంచారు. ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నెలకొల్పాం’ అని అన్నారు. మరోవైపు సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ మట్లాడుతూ మహిళల చెస్ టోర్నీ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, శ్రీధర్రెడ్డి, వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.