అనుకోని రీతిలో ఈ ఏడాది రెండు దశలుగా సాగిన ఐపీఎల్ సీజన్ చివరి అంకానికి వచ్చేసింది. సగం మ్యాచ్లు ముగిసేసరికే సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ పోటీ నుంచి తప్పుకుంటే.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ లీగ్ దశకే పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్లో నిలకడ లోపించగా.. లోకేశ్ రాహుల్ ఒంటరి పోరాటం పంజాబ్ను ముందుకు నడిపించలేకపోయింది. లీగ్ ఆసాంతం వెనుకబడ్డ కోల్కతా ఆఖరి రెండు మ్యాచ్లు నెగ్గి నాలుగో ప్లేస్ కొట్టేయగా.. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఇప్పటి వరకు ఒక లెక్కా.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న టాలీవుడ్ సినిమా డైలాగ్ మాదిరిగా.. ఐపీఎల్లో ఇకపై మరింత రసవత్తరమైన మ్యాచ్లు అభిమానులను కనువిందు చేయనున్నాయి.
ఆదివారం తొలి క్వాలిఫయర్లో టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్తో
చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొననుంది. ఒత్తిడిని జయించడంలో ధోనీని మించిన నాయకుడు లేకున్నా.. లీగ్ చివరి మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైన చెన్నై కీలక పోరులో
ఏం చేస్తుందో చూడాలి! మరోవైపు పంత్ గ్యాంగ్ తొలి టైటిల్ చేజిక్కించుకోవాలని
తహతహలాడుతున్నది. మరింకెందుకు ఆలస్యం ఐపీఎల్ 14వ సీజన్
తొలి ఫైనలిస్ట్ను తేల్చే మ్యాచ్ చూసేందుకు టీవీలు ట్యూన్ చేసేయండి!
దుబాయ్: ముదుర్లందరినీ ఒక్కచోట చేర్చిన మహాముదురు మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి టైటిల్ పట్టాలని తహతహలాడుతుంటే.. అనుకోకుండా జట్టు పగ్గాలందుకున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఢిల్లీకి తొలి టైటిల్ అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఐపీఎల్-14వ సీజన్లో ఈ రెండు జట్ల ప్రయాణం దాదాపు ఒకే విధంగా సాగినా.. ఢిల్లీ నిలకడగా విజయాలు సాధిస్తే.. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారయ్యాక చెన్నై కాస్త రిలాక్స్ అయింది. గత మూడు మ్యాచ్ల్లో ధోనీ సేన హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. అయితే కీలక మ్యాచ్ల్లో సత్తాచాటడం ఎలాగో బాగా తెలిసిన ధోనీ సేన ఆదివారం ఢిల్లీపై నెగ్గి ఈ సీజన్లో తొలి ఫైనలిస్ట్గా నిలువాలని భావిస్తున్నది. యూఏఈలో జరిగిన గత ఐపీఎల్లో లీగ్ దశకే పరిమితమై నిరాశపరిచిన చెన్నై ఈసారి టైటిలే లక్ష్యంగా సాగుతున్నది. మరోవైపు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజేతగా నిలువలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతా తెరువాలని కృతనిశ్చయంతో ఉంది. లీగ్ దశలో ఢిల్లీ 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిస్తే.. చెన్నై 18 పాయింట్లతో రెండో ప్లేస్తో క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. దేశీ ఆటగాళ్లే ఢిల్లీ బలమైతే.. అనుభవం, యువరక్తంతో కూడిన కూర్పు చెన్నైది. కాగితం మీద ఢిల్లీ కాస్త బలంగా కనిపిస్తున్నా.. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే చెన్నైకే ఫైనల్ చేరే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.
‘డాడీస్ ఆర్మీగా’ ముద్రపడ్డ జట్టు ఓ వైపు..
యువ ఆటగాళ్లతో నిండిన టీమ్ మరోవైపు!
ధోనీ, రైనా, రాయుడు వంటి సీనియర్లు ఓ వైపు.. శ్రేయస్, రిషబ్, పృథ్వీ షా వంటి
యంగ్ తరంగ్లు మరోవైపు!
మూడు సార్లు కప్పు కొట్టిన అనుభవం ఒకరిదైతే..
ఇప్పటి వరకు టైటిల్ ముద్దాడని ఆతృత మరొకరిది!
ఐపీఎల్ 14వ సీజన్ తొలి క్వాలిఫయర్లో చెన్నై, ఢిల్లీ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి!
తుది జట్లు (అంచనా)
ఢిల్లీ: పంత్ (కెప్టెన్), పృథ్వీ, ధవన్, శ్రేయస్, హెట్మైర్, స్టొయినిస్/రిపాల్, అక్షర్, అశ్విన్, రబడ, నోర్జే, అవేశ్.
చెన్నై: ధోనీ (కెప్టెన్), గైక్వాడ్, డుప్లెసిస్, అలీ, రాయుడు, ఉతప్ప/రైనా, జడేజా, బ్రావో, శార్దూల్, దీపక్, హజిల్వుడ్.
చెన్నై సూపర్ కింగ్స్తో ఆడిన గత నాలుగు మ్యాచ్ల్లోనూ ఢిల్లీ
విజయాలు సాధించింది
ప్లే ఆఫ్స్ చేరాయిలా..
ఢిల్లీ చెన్నై
10 విజయాలు 9 విజయాలు
20 పాయింట్లు 18 పాయింట్లు