దంబుల్లా: శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20సిరీస్లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియా 34 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత జెమీమా రోడ్రిగ్స్ (36 నాటౌట్, షెఫాలీ వర్మ (31) విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 138 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన(1), తెలుగు క్రికెటర్ సబ్బినేని మేఘన (0) నిరాశపర్చారు.
వీరిద్దరి నిష్క్రమణతో టీమ్ఇండియా 17 పరుగులకే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఈ తరుణంలో షెఫాలీవర్మ, కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ (22) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దూకుడుగా ఆడే ప్రయత్నంలో వర్మ ఔట్ కావడంతో మూడో వికెట్కు 39 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రో డ్రిగ్స్.. కౌర్కు జత కలిసింది.
వీరిద్దరు గేర్ మార్చే ప్రయత్నంలో కౌర్ను రణవీర వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో టీమ్ఇండియా కష్టాల్లో పడింది. ఈ తరుణంలో చివరి వరస బ్యాటర్లతో కలసి రోడ్రిగ్స్ను ఇన్నింగ్స్ను నిలబెట్టింది. రణవీర(3/30)కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన లంక 20 ఓవర్లలో 104/5 స్కోరుకు పరిమితమైంది. రాధాయాదవ్(2/22) రాణించగా, దీప్తిశర్మ, పూజ, షెఫాలీ ఒక్కో వికెట్ తీశారు. కవీశా దిల్హారీ(47 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినా లాభం లేకపోయింది. రోడ్రిగ్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో మ్యాచ్ జరుగనుంది.