లండన్: క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్తో చారిత్రక టెస్టు మ్యాచ్ను భారత అమ్మాయిలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. తొలి రోజు బ్యాట్తో మెప్పించిన టీమిండియా రెండో రోజు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. పేసర్ క్రాంతి గౌడ్ (5/37) కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో ఆతిథ్య జట్టును 170 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో భారత్కు 115 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంగ్లిష్ టీమ్లో ఎమీ జోన్స్ (52), కెప్టెన్ సివర్ బ్రంట్ (44), మయా బుషెర్ (23) తప్ప మిగతా వాళ్లు తేలిపోయారు. అలీస్ కాప్సీ (9), హెథర్ నైట్ (6) నిరాశపరిచారు. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ 33 పరుగుల వ్యవధిలోనే చివరి 5 వికెట్లు కోల్పోయింది.
క్రాంతికి తోడు సయాలీ సత్ఘారే, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. శనివారం ఆట చివరకు 154/1 స్కోరు చేసింది. తన ఫామ్ కొనసాగించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (69 బ్యాటింగ్ ) వరుసగా రెండో అర్ధ శతకంతో సత్తా చాటింది. అద్భుతమైన షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లపై పైచేయి సాధించిన మంధాన తొలి వికెట్కు షెపాలీ వర్మ (33)తో 88 పరుగులు, రెండో వికెట్కు యస్తికా భాటియా (39 బ్యాటింగ్)తో అజేయంగా 66 రన్స్ జోడించి జట్టును బలమైన స్థితిలో నిలిపింది. ప్రస్తుతం భారత్ మొత్తంగా 269 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది.