నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కాస్తా..ఇంజూరీ ప్రీమియర్ లీగ్గా మారింది. వారం రోజుల వ్యవధిలో 19వ ఐపీఎల్ సీజన్కు తెరలేవనున్న వేళ పలువురు ప్లేయర్ల గాయాలు ఫ్రాంచైజీలను కలవరపెడుతున్నాయి. వేలంలో కోట్లు పెట్టి కొన్న ప్లేయర్లు లీగ్ ప్రారంభ సమయానికి గాయాలతో దూరం కావడం ఫ్రాంచైజీల గెలుపు, ఓటములపై ప్రభావం చూపించనుంది. ప్రత్యర్థి జట్ల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ దేశవాళీ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ప్లేయర్లను తీసుకున్న ఫ్రాంచైజీలకు ఇప్పుడు ప్లేయర్ల గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
కొందరు గాయాలతో లీగ్ మొత్తానికే దూరమైతే..మరికొందరు కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. దీనికి తోడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన ఓవైపు పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతున్న వేళ పలువురు ప్లేయర్ల రాకపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లీగ్లో ఏయే జట్లపై ఎంత మేర ప్రభావం పడుతుందో ఓసారి చుద్దాం.
మిగతా ఫ్రాంచైజీలతో పోలిస్తే ఐపీఎల్ మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ ప్లేయర్ల గైర్హాజరీ రూపంలో ఇబ్బందులు ఎదుర్కొనుంది. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్కింగ్స్ ఉన్నాయి. జట్ల వారీగా చూస్తే…
కోల్కతా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇప్పటికి మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన కేకేఆర్ ఈసారి లీగ్ మొదలుకావడానికి ముందే ఇబ్బందుల్లో పడింది. రికార్డు స్థాయిలో వేలంలో 18 కోట్లు పెట్టి కొన్న లంక స్టార్ బౌలర్ మతీశ పతిరణకు ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ లభించలేదు. టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఎడమ కాలు కండరాల గాయానికి గురైన పతిరణ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీనికి తోడు టీమ్ఇండియా తరఫున నిలకడగా రాణిస్తున్న హర్షిత్ రానా లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. తన వైవిధ్యమైన బౌలింగ్తో బ్యాటర్లను బోల్తా కొట్టించే రానా కుడి మోకాలికి గాయమైంది. ఇటీవల జరిగిన బీసీసీఐ అవార్డుల వేడుకకు రానా ఊతకర్రల సాయంతో వచ్చాడు. వీరిద్దరి గైర్హాజరీలో కేకేఆర్ బౌలింగ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే రానున్న సీజన్కు రహానే కెప్టెన్గా ఖరారు కాగా, ఓపెనింగ్ ద్వయంపై స్పష్టత రావాల్సి ఉంది.
డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీకి స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ అందుబాటులో లేకుండా పోయే అవకాశం కనిపిస్తున్నది. గాయం కారణంగా గత నవంబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్న హాజిల్వుడ్కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)..ఐపీఎల్ ఆడేందుకు ఇంకా ఎన్వోసీ ఇవ్వలేదు. దీంతో లీగ్లో తొలి షెడ్యూల్ మ్యాచ్లకు హాజిల్వుడ్ దూరం కానుండగా, నువాన్ తిశార..ఎన్వోసీ కోసం ఎదురుచూస్తున్నాడు.
ఆర్సీబీ లాగే సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) అదే పరిస్థితి ఎదుర్కొంటున్నది. హాజిల్వుడ్ లాగే కమిన్స్ ప్రాతినిధ్యంపై స్పష్టత రావాల్సి ఉంది. గాయం కారణంగా కమిన్స్ గత ఎనిమిది నెలల్లో ఒకే మ్యాచ్ ఆడాడు. భవిష్యత్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని సీఏ నిర్ణయం తీసుకోనుంది. కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ను తాత్కాలిక కెప్టెన్గా ఎంపిక చేశారు. భుజం గాయానికి గురైన ఇషాన్ మలింగ పూర్తిగా కోలుకోకపోవడం హైదరాబాద్ అవకాశాలను దెబ్బతీయనుంది.

వేలంలో రూ.2.50 కోట్లకు చెన్నై తీసుకున్న ఆస్ట్రేలియా డెత్ ఓవర్స్ స్పెషలిస్టు నాథన్ ఎలీస్ కండరాల గాయంతో లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. పతిరణ స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్న ఎలీస్ ఆదిలోనే దూరం కావడం చెన్నై తుది కూర్పుపై ప్రభావం చూపించనుంది. మరోవైపు తన ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాలు అందిస్తాడనుకున్న సామ్ కరన్ లీగ్ మొత్తానికి దూరమయ్యాడు.
ఇలా స్టార్ ప్లేయర్లకు తోడు జాక్ ఎడ్వర్డ్స్(హైదరాబాద్), అతర్వ అంకోల్కర్(ముంబై), మాథ్యూ షార్ట్(చెన్నై), మిచెల్ స్టార్క్(ఢిల్లీ) లీగ్లో ఎన్ని మ్యాచ్లు ఆడుతారు అనేది తేలాల్సి ఉంది.