న్యూఢిల్లీ: కబడ్డీ ఆటకు వేళయైంది. గ్రామీణ క్రీడకు కార్పొరేట్ హంగులు అద్దుదుతూ అభిమానులను అలరిస్తున్న కబడ్డీ మరోమారు సిద్ధమైంది. ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పదో సీజన్కు శనివారం తెరలేవనుంది. తెలుగు టైటాన్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. గత సీజన్లను మరిపిస్తూ ఈసారి దుమ్మురేపాలన్న పట్టుదలతో టైటాన్స్ బరిలోకి దిగుతున్నది. 2014లో మొదలైన పీకేఎల్ 30 సెకన్ల రైడ్, డూ ఆర్ డై రైడ్స్, సూపర్ రైడ్స్, సూపర్ ట్యాకిల్ లాంటి వినూత్న నియమాలను అమలు చేసి అభిమానులకు మరింత చేరువైంది. ఈ కారణంగా దేశంలో క్రికెట్ తర్వాత అత్యధిక జనాదరణ కల్గిన లీగ్గా కబడ్డీ రికార్డుల్లోకెక్కింది.
లీగ్ పదో సీజన్లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా శుక్రవారం అహ్మదాబాద్లోని అక్షర్ రివర్క్రూజ్లో వివిధ ఫ్రాంచైజీ కెప్టెన్లతో కలిసి లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి ట్రోఫీని ఆవిష్కరించారు. రైడింగ్లో తనకంటూ ప్రత్యేకతను దక్కించుకున్న పవన్ షెరావత్ ఈసారి కెప్టెన్గా వ్యవహరించడం టైటాన్స్కు బాగా కలిసిరానుంది. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ ‘తమ తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో తలపడబోతున్నాం. మ్యాట్పై అడుగుపెట్టేందుకు ఎప్పుడెప్పుడా ఆతృతగా ఎదురుచూస్తున్నా. గత సీజన్కు దూరంగా ఉండటం నిరాశ కల్గించింది. మొదటి మ్యాచ్లో ఫజల్ అత్రాచలి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. కోచింగ్ క్యాంప్లో ప్లేయర్లందరూ మెరుగైన శిక్షణ పొందారు’ అని అన్నాడు. పీకేఎల్ అహ్మదాబాద్ అంచె ఈ నెల 7వరకు జరుగనుండగా, జనవరి 19 నుంచి 24 వరకు జరిగే మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. పీకేఎల్ స్టార్స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.