భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కుటిల రాజకీయాలకు వేదికగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆధిపత్య పోరాటంతో బోర్డులో పవర్గేమ్కు తెరదీసింది. అవసరానికి తగ్గట్లు వాడుకోవడం..అవసరం తీరిన తర్వాత అంతే ఈజీగా వదులుకోవడాన్ని నరనరాన జీర్ణించుకున్న బీజేపీ అదే తంతుగా బీసీసీఐలోనూ చక్రం తిప్పుతున్నది. చెప్పిన మాట వినకపోతే తమ తఢాకా చూపిస్తామన్న తరహాలో నియంతృత్వ పోకడలు షురూ చేసింది. తన అద్భుత ఆటతీరుకు తోడు నాయకత్వ పటిమతో దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలందించి దిగ్గజాల్లో ఒకడిగా వెలుగొందుతున్న సౌరవ్ గంగూలీకి తమదైన రీతిలో చెక్ పెట్టింది.
సుప్రీం కోర్టు తీర్పుతో వరుసగా రెండోసారి అధ్యక్ష పదవిలో కొనసాగుదామనుకున్న గంగూలీ ఆశలపై నీళ్లు గుమ్మరిస్తూ పార్టీ పెద్దలు ప్రణాళిక రచించారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..గంగూలీని అధ్యక్ష పదవికి దూరం చేసేందుకు పనిగట్టుకుని కూర్చున్నారు. 1983 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ పేరును అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు..దాదాగిరీకి తలుపులు తెరిచారు. బీసీసీఐలో గంగూలీ శకానికి ముగింపు పలుకుతూ కీలక పదవులను దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికను ఎంచుకున్నారు.ఈ క్రమంలో తమ వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ పదవుల పందేరం సాగిస్తున్నారు. ఓవైపు బీసీసీఐలో దాదాగిరీకి ఫుల్స్టాప్ పడుతున్న వేళ..అమిత్ షా తనయుడు జైషా మరింత దూకుడు పెంచాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐని బీజేపీ తమ గుప్పిట్లోకి తీసుకుంటున్న వైనంపై ప్రత్యేక కథనం.
కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నది. ప్రతీ రంగంలో తమదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను తమ కుటిల రాజకీయాలతో దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక కంపెనీల ప్రస్థానాన్ని ప్రశ్నార్థకం చేసిన బీజేపీ.. ప్రపంచంలోనే సంపన్న బోర్డుగా వెలుగొందుతున్న బీసీసీఐపై కన్నేసింది. అనుకున్నదే తడువుగా తమకు అడ్డుగా ఉన్నాడని భావిస్తున్న బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీని తొలిగించాల నే నిర్ణయానికి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ, ముంబైలో జరుగుతున్న పరిణామాలు బోర్డులో మార్పులకు శ్రీకారం చుట్టాయి.
అప్పటి వరకు అసలు పోటీలోనే లేని మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ అనూహ్యంగా తెరపైకి రావడం, అప్పటి వర కు రెండోసారి అధ్యక్ష పదవిని అనుభవిస్తాననుకున్న గంగూలీని తప్పించడం వరకు కేంద్ర పెద్దల కనుసన్నల్లో జరుగుతున్నాయి. తమ ఆలోచనలకు అనుగుణంగా చెప్పినట్లు వినకపోతే ఫలితం అనుభవించాల్సి వస్తుందన్న తరహాలో గంగూలీకి చెక్ పెట్టడం బీసీసీఐలో కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లయ్యింది. బోర్డులో రోజురోజుకు తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్న ప్రస్తుత కార్యదర్శి జై షా…తన తండ్రి హోం శాఖ మంత్రి అమిత్ షా సూచనలకు అనుగుణంగా మంత్రాంగం నడపడంతో బోర్డు రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని రీతిలో రక్తి కట్టిస్తున్నాయి.
బీసీసీఐలో గంగూలీ ప్రస్థానం ముగియడం వెనుక చాలా కారణాలు దాగున్నాయి. ముఖ్యంగా బెంగాల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ..మమతా బెనర్జీకి గంగూలీ రూపంలో చెక్ పెట్టాలని చూసింది. ఇందులో భాగంగా దాదాను మచ్చిక చేసుకున్న కేంద్ర ప్రభుత్వం..బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎరవేసింది. ఇంతవరకు బాగానే ఉంది. అప్పటి వరకు బెంగాల్ క్రికెట్ వ్యవహారాల్లో బిజీగా ఉన్న దాదా..ఏకంగా బోర్డు అధ్యక్షుడయ్యాడు. ఇంకేముంది తనదే హవా అనుకున్నాడు. కానీ కాలం గడుస్తున్నా కొద్ది పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఎప్పుడు నీడలా వెంటాడే అమిత్ షా తనయుడు జైషా..గంగూలీ ప్రతీ అడుగును ఫాలో అయ్యాడు. 2019లో బోర్డు పగ్గాలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సన్నిహితంగా మెలిగిన జై షా విషపు కౌగిలిలో దాదా బందీ అయ్యాడు.
ఈ అనూహ్య పరిణామాన్ని ఊహించని గంగూలీ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, పెద్దలతో నిరంతరం సంప్రదింపులు చేసినా లాభం లేకపోయింది. ఇదిలా ఉంటే బెంగాల్లో మమతను ఎదుర్కొవాలంటే దాదాపు అంతే చరిష్మా ఉన్న గంగూలీని ముందుపెట్టాలనుకున్న కేంద్ర పెద్దల ప్రణాళిక బెడిసి కొట్టడంతో కక్షపూరిత చర్యలకు దిగారు. ఇందుకు బీసీసీఐ ఎన్నికలను వాడుకున్నారు. అనుకున్నదే తడువుగా వివాదరహితుడిగా ముద్రపడ్డ రోజర్ బిన్నీని ముందుపెట్టి మైండ్గేమ్కు తెరతీశారు. ఇంకేముంది అమిత్ షా కనుసన్నల్లో మొత్తం తతంగం జరుగుతున్నది. బుధవారం నామినేషన్లకు ఆఖరి రోజు కాగా ఇప్పటికే బిన్నీ, జైషా(కార్యదర్శి), రాజీవ్శుక్లా(ఉపాధ్యక్షుడు), అశీష్ షిలార్(కోశాధికారి), దేవజిత్ సైకియా(సంయుక్త కార్యదర్శి) నామినేషన్లు వేశారు. ప్రత్యర్థులుగా ఎవరు లేకపోవడంతో ఈనెల 18న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్)లోవీరి ఏకగీవ్ర ఎన్నిక లాంఛనం అయ్యే అవకాశముంది.
తమ అవసరాలకు తగ్గట్లు వాడుకోవడం.. పని పూర్తయిన తర్వాత వదిలేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. అది రాజకీయాలైనా ఇంకా ఏదైనా. తమ ఆధిపత్యానికి అడ్డువస్తారని భావిస్తే చాలు..వారిని ఏదో ఒక రకంగా ముప్పుతిప్పలు పెట్టి దారిలోకి తెచ్చుకోవడం బీజేపీ అనుసరిస్తున్న విధా నం. ఇది ఇప్పుడు బీసీసీఐలోనూ బీజేపీ తీసుకొచ్చింది. ఇన్ని రోజులు గంగూలీని బెంగాల్లో తమ పార్టీకి ఆయువుపట్టుగా భావిస్తూ వచ్చిన కేంద్ర పెద్దలు..తమ పాచిక పారకపోవడంతో కక్షపూరిత వైఖరి అవలంభిస్తున్నారు.
ఏనాడు రాజకీయాల పట్ల ఆసక్తి కనబరచని గంగూలీ..తమ మాట చెప్పినట్లు వినడం లేదని భావించిన బీజేపీ అగ్రనాయకత్వం బోర్డులో అధికార మార్పిడికి స్కెచ్ వేసింది. అందుకు తగ్గట్లు అధ్యక్ష పదవి నుంచి దాదాను పక్కకు తప్పిస్తూ పావులు కదిపింది. ఐపీఎల్ చైర్మన్ పదవి ఆశచూపినా..దాదా ఆసక్తి చూపకపోవడంతో అసలుకే ఎసరు పెట్టింది. ఐసీసీలోనూ జై షా పట్టు నిలుపుకునేందుకు అడ్డుగా ఉన్న దాదాను పక్కకు తప్పించింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ..దాదాకు మద్దతుగా నిలిచింది. సంక్లిష్ట సమయంలో మేము మీ వెంట ఉంటామంటూ టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ట్వీట్ చేశారు.
బీసీసీఐలో వారసుల హవా కొనసాగుతున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడు జై షా కార్యదర్శిగా మరోమారు పదవిలో కొనసాగేందుకు సిద్ధమవుతున్నాడు. ఇన్నాళ్లు తెరవెనుక రాజకీయాలు నడిపిన జైషా ఇక నుంచి అన్నీతానై బోర్డు నడిపించే అవకాశముంది. దాదా గైర్హాజరీలో బోర్డు కార్యదర్శిగా ఐసీసీలోనూ చక్రం తిప్పేందుకు జై షా పావులు కదుపుతున్నాడు. ఇదిలా ఉంటే కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్..ఐపీఎల్ చైర్మన్గా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది.
ఇన్ని రోజులు కోశాధికారిగా ఉన్న ధుమాల్.. బ్రిజేష్ పటేల్ స్థానంలో ఐపీఎల్ పగ్గాలు స్వీకరించనున్నాడు. మహారాష్ట్ర బీజేపీ నేత అశిష్ షీలర్ కోశాధికారిగా నామినేషన్ వేశాడు. ఎన్సీపీ నేత శరద్ పవార్కు సన్నిహితుడైన అశిష్.. ప్రస్తుతం ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అస్సాం సీఎం హిమంతబిశ్వశర్మ సన్నిహితుడు దేవజిత్ సైకియా..జయేశ్ జార్జ్ స్థానంలో కొత్త సంయుక్త కార్యదర్శిగా పగ్గాలు అందుకోనున్నాడు.