కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో శనివారం 9వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు, 66 మంది కోచ్లు, 45 టెక్నికల్ ఆఫీషియల్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అండర్-14, 16, 18, 20 విభాగాల్లో బాల బాలికలకు, పురుషులు, మహిళలకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు 20, 10వేల మీటర్ల రేస్వాక్, షార్ట్ఫుట్, లాంగ్జంప్, హైజంప్, డిస్కస్ త్రో, 100, 200 మీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
రెండో రోజు ఆదివారం హర్డిల్స్, హ్యామర్త్రో, ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అక్టోబర్ చివరి వారంలో వరంగల్లో జరిగే సౌత్జోన్ క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి ఫోటో ఫినిష్ టెక్నాలజీని ఈ పోటీల నిర్వహణలో వినియోగిస్తున్నారు. ముగింపు కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పాల్గొంటారు. పోటీలను రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు స్టాన్లీ జోన్స్, సారంగపాణి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజవీరు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, కడారి రవి పర్యవేక్షిస్తున్నారు.