Dhoni | భారత దేశానికి రెండు ప్రపంచకప్లు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. రిటైర్మెంట్కు సంబంధించిన కీలక విషయాన్ని బయటపెట్టాడు. నాలుగేండ్ల క్రితం ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమ్ఇండియా ఓటమి పాలవగా.. ఆ మ్యాచ్లో రనౌట్గా వెనుదిరిగిన ధోనీ.. ఆ క్షణానే దేశం తరఫున తన చివరి మ్యాచ్ ఆడేశానని అనుకున్నాడట. కానీ నిర్ణయం మాత్రం వెంటనే ప్రకటించని ధోనీ.. ఏడాది విరామం తీసుకొని 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
వీడ్కోలు అంశంపై మహీ తాజగా తన మనసులో మాట వెల్లడించాడు. ‘ఉత్కంఠ పోరులో పరాజయం పాలైతే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టం. 2019 వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ మ్యాచ్లో రనౌటైన సమయంలో దేశం తరఫున నా బాధ్యత ముగిసిందని అనుకున్నా. ఏడాది తర్వాత నా నిర్ణయం వెల్లడించినా.. మనసులో మాత్రం ఆ మ్యాచ్తోనే నేను రిటైరయ్యా’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.
Read More: Suhas Yathiraj: 2021 ఒలింపిక్స్లో రజతం.. ఇప్పుడు ఆసియా పారా క్రీడల్లో స్వర్ణం గెలిచిన కలెక్టర్!
ఒలింపిక్స్, కామన్వెల్త్, ఐసీసీ టోర్నమెంట్స్ వంటి వాటిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదని మహీ అభిప్రాయపడ్డాడు. దేశం తరఫున బరిలోకి దిగే అవకాశం దక్కడమే పెద్ద విషయం అనుకున్న తనకు సుదీర్ఘ కాలం జట్టుతో కొనసాగే భాగ్యం లభించిందని మహీ వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన మహీ ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్గా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ట్రోఫీ అందుకున్న మహీ.. వచ్చే సీజన్లోనూ ఆడనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు తాజా వన్డే ప్రపంచకప్లో భారత జట్టు చక్కగా ఆడుతున్నదని.. మున్ముందు కూడా ఇదే జోరు కొనసాగించాలని ధోనీ ఆకాంక్షించాడు.