Suhas Yathiraj: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడలలో భారత బ్యాడ్మింటన్ ఆటగాడు సుహాస్ యతిరాజ్ స్వర్ణం నెగ్గారు. శుక్రవారం ముగిసిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్4 కేటగిరీలో యతిరాజ్.. 21-13, 18-21, 21-9 తేడాతో మలేషియాకు చెందిన బుర్హనుద్దీన్ మహ్మద్ అమీన్ను ఓడించి పసిడి కైవసం చేసుకున్నారు. ఎస్4 కేటగిరీలో ప్రపంచ రెండో ర్యాంకర్ గా ఉన్న యతిరాజ్.. వృత్తిరిత్యా కలెక్టర్ అన్న విషయం చాలా మందికి తెలియదు.
సుహాస్ యతిరాజ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ నుంచి 2007 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన గౌతమ్ బుద్ద నగర్ తో పాటు అజమ్గఢ్, ప్రయాగ్ రాజ్ జిల్లాలకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా పనిచేశారు. ప్రస్తుతం గౌతమ్ బుద్ద నగర్ డీఎంగా ఉన్నారు. కర్నాటకలోని హసన్ జిల్లాకు చెందిన యతిరాజ్.. సురత్కాల్ (కర్నాటక) ఎన్ఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ఆయన విశేషమైన కృషి చేశారు.
Congratulations to @suhas_ly on clinching Gold in Badminton Men’s Singles SL-4 at the Asian Para Games! He has showcased unparalleled dedication and skill. This accomplishment beautifully echoes his relentless drive and passion. pic.twitter.com/C4O3o2KQzW
— Narendra Modi (@narendramodi) October 27, 2023
బిజీ షెడ్యూల్లోనూ ఒలింపిక్స్..
2016లో బ్యాడ్మింటన్ ఆటను ఓ హాబీగా ప్రారంభించిన యతిరాజ్.. తర్వాత ప్రొఫెషనల్ ప్లేయర్గా ఎదిగారు. అజమ్గఢ్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభానికి వెళ్లిన ఆయన ఆ ఆటపట్ల ఆకర్షితుడై పారా కోచ్ గౌరవ్ ఖన్నా దగ్గర శిక్షణ తీసుకుని ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్గా మారారు. రాష్ట్ర స్థాయిలో పలువురిని ఓడించిన యతిరాజ్.. 2016 ఆసియన్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం నెగ్గారు. 2018లో ఆసియా పారా గేమ్స్లో కాంస్యం గెలిచిన యతిరాజ్.. 2021లో డీఎంగా బిజీ షెడ్యూల్ ఉన్నా టోక్యో ఒలింపిక్స్లో పాల్గొని రజతం సాధించారు. అదే ఏడాది థాయ్లాండ్ వేదికగా జరిగిన థాయ్లాండ్ పారా బ్యాడ్మింటన్ టోర్నీలోనూ విజేతగా నిలిచారు. తాజాగా నాలుగో ఆసియా పారా గేమ్స్లో కూడా స్వర్ణం గెలిచారు.