KCR : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల బతుకులు బాగుపడేందుకు 1100 గురుకుల పాఠశాలలు పెట్టామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అందజేశామన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికన్నా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ వచ్చినయా అని ఆయన ప్రశ్నించారు.
‘గిరిజనుల కోసం, మైనారిటీల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం మేం ప్రత్యేక గురుకులాలు పెట్టినం. రాష్ట్రంలో 1100 గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ల బతుకులు బాగు చేసే ప్రయత్నం చేసినం. అక్కడ చదువుకున్న పిల్లలు ఐఐటీ, ఐఐఎం, ఎంబీబీఎస్, ఐఏఎస్ తదితర పరీక్షల్లో కూడా రాణిస్తున్నరు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్నపుడు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ రూ.20 లక్షల చొప్పున ఇచ్చినం. ఇప్పుడు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నరా..? ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నరా..? మరె ఈ ప్రభుత్వం ఏం జేస్తుంది డబ్బులన్నీ..?’ అని కేసీఆర్ నిలదీశారు.
‘గిరిజనులు కోసం చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా బంజారాహిల్స్లో బంజారాభవన్ను, కుమ్రం భీమ్ పేరు మీద ఆదివాసీ భవన్ కట్టినం. ఏ ప్రభుత్వమన్నా కట్టిందా..? మీరందరు కూడా ఒక ఆలోచన చెయ్యాలె. కరెంటు కాట కలిసింది. ఈ రోజు కాంగ్రెస్ పాలనలో ఏదీ జరుగలేదు. రైతుబంధు రాలే. రుణమాఫీ కాలేదు. అన్ని హామీలు హుళక్కే అయినయ్. అరచేతిలో వైకుంఠం చూపించి, గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఘోరమైన పనులు చేస్తున్నది. జిల్లాలను తీసేస్తం అంటున్నరు. జిల్లాలను మనం పనిలేక పెట్టినమా..?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.