India Tour of South Africa: వచ్చే నెలలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ నెగ్గని భారత జట్టు ఈసారి ఎలాగైనా ఆ అవకాశాన్ని జారవిడవొద్దని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే భారత సీనియర్ జట్టు కంటే ముందుగానే అక్కడికి వెళ్లాల్సి ఉన్న ‘ఇండియా – ‘ఏ’ జట్టుతో పలువురు టెస్టు స్పెషలిస్టులను పంపించనుంది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే, పేసర్ జయదేవ్ ఉనద్కత్లు ఇండియా-ఏ తోనే వెళ్లి అక్కడ సౌతాఫ్రికా – ఏ తో నాలుగు రోజుల మ్యాచ్లు మూడు ఆడనున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘అవును. సఫారీ పర్యటనకు వెళ్లనున్న ఇండియా – ఏ జట్టు అక్కడ సౌతాఫ్రికా – ఏ తో నాలుగు రోజుల మ్యాచ్లు మూడు ఆడనుంది. కొద్దిరోజుల్లోనే అందుకు సంబంధించిన జట్టును ప్రకటిస్తాం. ఇటీవల కాలంలో దేశవాళీలో రాణిస్తున్న ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేస్తాం. పలువురు యువ ఆటగాళ్లతో పాటు కొంతమంది సీనియర్లు కూడా వారితో కలుస్తారు. దక్షిణాఫ్రికాతో జరుగబోయే డిసెంబర్ 26 నుంచి మొదలుకాబోయే టెస్టు సిరీస్ కు ముందే వాళ్లకు ఇది ప్రాక్టీస్గా ఉపయోగపడనుంది..’అని తెలిపాడు.
India A set is set to play 3 four-day matches in South Africa ahead of the Test series. [PTI]
– Some of seniors set to play in this series. pic.twitter.com/OfTVz8e72e
— Johns. (@CricCrazyJohns) November 24, 2023
అయితే పేర్లు చెప్పకున్నా టెస్టు స్పెషలిస్టులు రహానే, అశ్విన్, ఉనద్కత్లు ఇండియా – ఏతో వెళ్లననున్నారని సమాచారం. ఇక వీరితో పాటు దేశవాళీలో కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, యశ్ ధుల్, కోన భరత్, ఉపేంద్ర యాదవ్, సౌరభ్ కుమార్ వంటి ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశాలున్నాయి. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భారత సీనియర్ జట్టు.. డిసెంబర్ 10 నుంచి 14 వరకూ మూడు టీ20లు ఆడనుండగా 17 నుంచి 21 వరకూ మూడు వన్డేలూ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత డిసెంబర్ 26-30 మధ్య బాక్సింగ్ డే టెస్టు, 2024 జనవరి 03-07 దాకా రెండో టెస్టు ఆడనుంది.