Deepthi Jeevanji | కోబ్: జపాన్లోని కోబ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక పారా అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్ప్రింటర్ దీప్తి జివాంజీ సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరీలో దీప్తి.. 55.06 సెకన్లలోనే పరుగును పూర్తి చేసి స్వర్ణం కైవసం చేసుకోవడంతో పాటు సరికొత్త ప్రపంచ రికార్డునూ నెలకొల్పింది. ఇదే పోటీలో అసైల్ ఒండర్ (55.19సె), లిజాన్శెలా అంగులో (56.68సె) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. దీంతో గతేడాది అమెరికా పారా అథ్లెట్ బ్రియాన్నా క్లార్క్ ఇదే టోర్నీలో నమోదుచేసిన 55.12 సెకన్ల రికార్డును ఈ కల్లెడ అమ్మాయి తిరుగరాసింది.
త్వరలో జరుగనున్న పారిస్ పారాలింపిక్స్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. 2023 పారా ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన దీప్తి.. తాజాగా అదే ప్రదర్శనను పునరావృతం చేయడం గమనార్హం. పేద రైతు కుటుంబం నుంచి దీప్తి అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ శిక్షణలో రాటుదేలిన దీప్తి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా పతకాలు కొల్లగొడుతున్నది.
ట్రాక్పై చిరుతను తలిపిస్తూ పోటీపడ్డ ప్రతీ టోర్నీలో కచ్చితంగా పతకం సాధిస్తూ దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నది. తాజాగా ప్రపంచ పారా అథ్లెటిక్స్ టోర్నీలో పసిడి పతకంతో మెరిసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్..దీప్తి ప్రపంచ రికార్డును ఎక్స్లో ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు పురుషుల ఎఫ్56 డిస్కస్ త్రో విభాగంలో యోగేశ్ కతునియా రజతం గెలిచాడు. ఇదే టోర్నీలో రెండ్రోజుల క్రితం ప్రీతి పాల్ (మహిళల 200 మీటర్ల టీ35 కేటగిరీలో) కాంస్యం గెలుచుకోగా పురుషుల టీ47 హైజంప్ విభాగంలో నిషద్ కుమార్ రజతం నెగ్గాడు.
అథ్లెటిక్స్లో అంచనాలకు మించి రాణిస్తున్న దీప్తి..అంచలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. తాను పుట్టిన పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం తప్ప..బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియని దీప్తి.. ఇప్పుడు దేశవిదేశాల్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నది. కెరీర్ ప్రారంభంలో రెగ్యులర్ అథ్లెటిక్స్లో పోటీపడ్డ దీప్తి..ఆ తర్వాత పారా అథ్లెటిక్స్ వైపు అడుగులు వేసింది. చివరిసారి 2022 జాతీయ ఇంటర్స్టేట్ చాంపియన్షిప్లో పోటీపడ్డ ఈ అమ్మాయి..పారా అథ్లెటిక్స్లో రాణిస్తున్నది. మానసికంగా పరిణితి లేని విభాగమైన టీ20లో పోటీపడుతూ పతకాలు సాధిస్తున్నది ఈ ఓరుగల్లు ముద్దుబిడ్డ.