పనాజీ: గోవా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన మహిళల 200మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ కాంస్య పతకంతో మెరిసింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన రేసులో దినిధీ దేసింగు (2:07:32సె, కర్నాటక), సంజన మంగేశ్ (2:08:89సె, గోవా), వ్రితి అగర్వాల్ (2:09:42సె, తెలంగాణ) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
ఇప్పటికే జాతీయస్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు కొల్లగొట్టిన వ్రితి నేషనల్ గేమ్స్లోనూ సత్తాచాటుతున్నది. మరోవైపు పురుషుల 15 రెడ్ స్నూకర్లో రాష్ర్టానికి చెందిన ముస్తాఖ్ఖాన్ సెమీస్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన క్వార్టర్స్లో ముస్తాఖ్ 3-2తో స్పర్శ్ ఫెర్వాణి(మహారాష్ట్ర)పై విజయం సాధించాడు. టోర్నీలో ఎనిమిది పతకాలతో తెలంగాణ ప్రస్తుతం 20వ స్థానంలో కొనసాగుతున్నది.