హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ యువ అథ్లెట్ సురభి ప్రసన్న స్వర్ణ పతకంతో మెరిసింది. మధ్యప్రదేశ్ గ్వాలియర్ వేదికగా జరుగుతున్న టోర్నీలో జిమ్నాస్టిక్స్ టేబుల్ వాల్ట్ ఈవెంట్లో సురభి ప్రసన్న 11.63 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. చేతన్ కోచింగ్లో రాటుదేలిన ప్రసన్న.. ఫ్లోర్ ఎక్సర్సైజ్లో మెరుగైన ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మరోవైపు 2 వేల మీటర్ల స్టీపుల్చేజ్లో తెలంగాణ గురుకుల అమ్మాయి సీహెచ్ కీర్తన రజత పతకం కైవసం చేసుకుంది. డిండి అథ్లెటిక్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న పాలకుర్తికి చెందిన కీర్తన..
ఆదివారం జరిగిన పోటీల్లో 7 నిమిషాల 17.37 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రాస్.. కీర్తనను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ క్రీడల్లో ఇప్పటి వరకు తెలంగాణ అథ్లెట్లు 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 12 పతకాలు కొల్లగొట్టారు.