హనుమకొండ: వీల్చైర్ క్రికెట్ టోర్నీలో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో తెలంగాణ 101 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత రాష్ట్ర దివ్యాంగుల జట్టు 15 ఓవర్లలో 197 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ 96 పరుగులకే కుప్పకూలింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ తెలంగాణ..ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, వారి విజయంతో రాష్ర్టానికి మరింత పేరు తీసుకొచ్చారన్నారు. విజేతగా నిలిచిన తెలంగాణ టీమ్కు ట్రోఫీతో పాటు క్రికెట్ కిట్, నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కవిత, అనితారెడ్డి, వీల్చైర్ కెప్టెన్ శ్రీధర్, భరత్, మిగతా జట్ల క్రికెటర్లు పాల్గొన్నారు.