జూబ్లీహిల్స్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. క్రీడల పట్ల విద్యార్థుల అభిరుచిని గుర్తించి.. ఆయా రంగాలలో వారికి ఆసక్తిని పెంపొందించేందుకు రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్ల ఏర్పాటు, ప్లేయర్లకు ప్రోత్సాహకాలు లాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. బుధవారం యూసుఫ్గూడ విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ‘తొలి తెలంగాణ గురుకులాల ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ ఛాంపియన్షిప్’ పోటీలను మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘ విద్యార్థుల మెదడుకు పదును పెట్టేందుకు చెస్ క్రీడ దోహదం చేస్తుంది. ఇందులో భాగంగా ఈనెల 30 వరకు దేశంలోని మేటి చెస్ ప్లేయర్లతో ఈ పోటీలను నిర్వహిస్తున్నాం’ అని అన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ పోటీలలో తెలంగాణ గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి 178 మంది విద్యార్థులు పోటీపడుతున్నారు. ఈ పోటీలలో విజేతలకు 105 ట్రోఫీలతో పాటు 103 మంది విజేతలకు రూ.5 లక్షల నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. తొలి రోజు రెండు రౌండ్లు ముగిసే సరికి కృష్ణతేజ, కౌస్తవ్ కుందు, రామకృష్ణ, సేతుమాధవ్ విజయాలతో ముందంజ వేశారు.