National Sports Awards | అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన క్రీడాకారులకు సముచిత గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర లిఖించిన సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి జోడీకి ప్రతిష్ఠాత్మక ఖేల్ రత్న అవార్డు దక్కింది. షూటింగ్లో పతకాలు కొల్లగొడుతున్న తెలంగాణ షూటర్ ఇషాసింగ్, పంచ్లతో ప్రత్యర్థుల పనిపడుతున్న హుసాముద్దీన్తో పాటు వన్డే ప్రపంచకప్లో అదరగొట్టిన షమీని అర్జున వరించింది.
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ 2023 ఏడాదికి గాను వార్షిక క్రీడా అవార్డుల విజేతలను ప్రకటించింది. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుతో పాటు అర్జున, ద్రోణాచార్య అవార్డులను బుధవారం ప్రకటించింది. మొత్తం 26 మంది ప్లేయర్లు అర్జున అవార్డులను కైవసం చేసుకున్నారు. జనవరి 9వ తేదీన జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్శెట్టి ద్వయం..ప్రతిష్ఠాత్మక ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు విజేతగా నిలిచింది. గత కొంతకాలంగా ఈ యువ జోడీ చిరస్మరణీయ విజయాలతో సత్తాచాటుతున్నారు. ఇటీవల హౌంగ్జౌ(చైనా) వేదికగా ఆసియాగేమ్స్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన సాత్విక్, చిరాగ్..ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం, కామన్వెల్త్ గేమ్స్లో రజతం దక్కించుకున్నారు.
గతేడాది అర్జున అవార్డు కైవసం చేసుకున్న ఈ ఆంధ్ర కుర్రాడు.. ఖేల్ రత్న అవార్డును ఖాతాలో వేసుకున్నాడు. ‘ఖేల్ రత్నకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చిందన్న వార్త తెలిసి అసలు నమ్మకలేకపోయాను. ఇంత తక్కువ వ్యవధిలో ఖేల్ రత్న వస్తుందని ఊహించలేకపోయాను. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకునేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నా.
అదే రోజు మలేషియా ఓపెన్ మొదలవుతున్నందున ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినా..నా తరఫున తల్లిదండ్రులు స్వీకరిస్తారు. నేను సాధిస్తున్న ఈ విజయాలకు వారే కారణం’ అని అన్నాడు. వన్డే వరల్డ్కప్లో 24 వికెట్లు తీసిన షమీతో పాటు వైశాలి, ఓజాస్ పర్వీన్, శ్రీశంకర్, అజయ్కుమార్రెడ్డిని అర్జున అవార్డు వరించింది.
మెరిసిన తెలంగాణ తారలు
అంతర్జాతీయ వేదికలపై అదరగొడుతున్న తెలంగాణ తారలు ఇషాసింగ్, మహమ్మద్ హుసాముద్దీన్..అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. పిన్న వయసులోనే అర్జున అవార్డు సొంతం చేసుకున్న తొలి తెలంగాణ ప్లేయర్గా ఇషాసింగ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మూడు రోజుల క్రితం విడుదలైన అవార్డు నామినేషన్లలో ఎంపికవుతానన్న నమ్మకం లేదు. కానీ అనూహ్యంగా అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది.
పారిస్(2024) ఒలింపిక్స్కు ముందు ఇది కచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. మరింత కష్టపడి పతకాలు సాధించేందుకు ఈ అవార్డు దోహదపడుతుంది. జనవరిలో జరిగే ఒలింపిక్స్ అర్హత టోర్నీ కోసం సిద్ధమవుతున్నాను’ అని అంది. ఇటీవల చైనాలో జరిగిన ఆసియాగేమ్స్లో 18 ఏండ్ల ఇషాసింగ్ నాలుగు పతకాలతో కొత్త చరిత్ర లిఖించింది. మరోవైపు ఇందూరు బాక్సర్ హుసాముద్దీన్ స్పందిస్తూ ‘అర్జున అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
ఇది మరింత కష్టపడి పనిచేసేందుకు దోహదపడుతుంది. గాయం నుంచి కోలుకుని పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నాను’ అని అన్నాడు. ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన హుసామ్..టోర్నీలో గాయపడి నిష్క్రమించాడు. పారిస్లో ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుదలతో ప్రస్తుతం ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు.