చెన్నై: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో ఆతిథ్య భారత్ అదిరిపోయే శుభారంభం చేసింది. శుక్రవారం మొదలైన టోర్నీలో బరిలోకి దిగిన ఆరు భారత జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఓపెన్ విభాగంలో 16 ఏండ్ల యువ చెస్ ప్లేయర్ రౌనక్ సాధ్వాని అద్భుత విజయంతో ఆకట్టుకున్నాడు. యూఏఈకి చెందిన అబ్దుల్ రెహమాన్ను ఓడించి ఔరా అనిపించాడు. ప్రత్యర్థులపై నిహాల్ సరీన్, గుకేశ్, అధిబన్ పైచేయి సాధించడంతో భారత్ 4-0తో యూఏఈపై బోణీ కొట్టింది. తన కెరీర్లో తొలిసారి ఒలింపియాడ్ ఆడుతున్న రౌనక్ తెల్లపావులతో 41 ఎత్తుల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించాడు. విదిత్, అర్జున్, నారాయణన్, శశికిరణ్తో కూడిన భారత ‘ఎ’ జట్టు 4-0తో జింబాబ్వేపై, సేతురామన్, అభిజిత్ గుప్తా, మురళీ, అభిమన్యుతో ఉన్న భారత ‘సి’టీమ్ 4-0తో సౌత్ సూడాన్పై గెలిచి ముందంజ వేసింది. కోనేరు హంపి, తానియా సచ్దేవ్, వైశాలి, భక్తి కులకర్ణితో కూడిన భారత మహిళల ‘ఎ’ జట్టు తజకిస్థాన్పై 4-0తో గెలిచింది. భారత్ ‘బి’ టీమ్ వేల్స్పై, భారత్ ‘సి’ హాంకాంగ్పై గెలిచాయి.