Gautam Gambhir : రెండో టీ20లో అల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనకపై భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఒకవేళ 2023 ఐపీఎల్ మినీ వేలం భారత్ – శ్రీలంక సిరీస్ తర్వాత జరిగి ఉంటే షనక కోసం ఫ్రాంఛైజీలు పోటీపడేవని అన్నాడు. అతడు వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచేవాడని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. దసున్ షనకను కొనుగోలు చేసేందుకు సరిపడా డబ్బులు నా దగ్గర లేవు. ఎందుకంటే.. అతను ఖరీదైన ఆటగాడిగా నిలిచేవాడు. భారత్పై రెండో టీ20లో అతను ఆడిన తీరే అందుకు కారణం అంటూ గంభీర్ వెల్లడించాడు. సిరీస్లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో షనక చెలరేగాడు. కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడిన అతను 22 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. అంతకుముందు బౌలింగ్లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రెండు మ్యాచుల్లో 206.12 స్ట్రైక్రేటుతో 102 రన్స్ చేసి ఈ సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచాడు.
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఈరోజు టీ20 ఫైనల్ పోరు జరగనుంది. రాజ్కోట్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇరుజట్లు చెరొక మ్యాచ్లో విజయం సాధించడంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండనుంది. ఇది టీమిండియాకు 14 టీ20 సిరీస్ ఫైనల్. డిసెంబర్ 23న కొచ్చిలో ఐపీఎల్ వేలం జరిగింది. ఆశ్చర్యకరంగా.. వేలంలో కనీస ధర రూ.50 లక్షలతో ఉన్న షనకను కొనేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ గ్లోబల్ మెంటార్గా ఉన్నాడు.