ఆస్ట్రేలియాపై మొదలైన భారత జైత్రయాత్ర.. నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్కప్లో టీమ్ఇండియా వరుసగా ఆరో విజయంతో అనధికారికంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మెగాటోర్నీలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న రోహిత్ గ్యాంగ్ ముందు.. ఇంగ్లండ్ నిలువలేకపోయింది. షమీ, బుమ్రా వాయు వేగానికి బట్లర్ సేన బిక్కుబిక్కుమంటూ బర్మింగ్హామ్ దారి పట్టింది!
కింగ్ కోహ్లీ డకౌట్.. గిల్, శ్రేయస్ కూడా వెనుదిరిగారు. ఇక భారత్ కోలుకోవడం కష్టమే అని సందేహిస్తున్న సమయంలో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. రాహుల్, సూర్యకుమార్ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఫలితంగా ఇంగ్లిష్ టీమ్ ముందు 230 పరుగుల లక్ష్యం నిలువగా.. ఈజీ టార్గెట్ను కూడా ఛేదించలేక బట్లర్ సేన బొక్కబోర్లా పడింది. బుమ్రా, షమీ బుల్లెట్ల వంటి బంతులు విసురుతుంటే.. పెవిలియన్ చేరడం తప్ప తమకు మరో దారి లేదన్నట్లు ఒకరి వెంట ఒకరు డగౌట్ బాట పట్టడంతో టీమ్ఇండియా సిక్సర్ కొట్టింది!
Cricket World Cup | లక్నో: వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా జోరు కొనసాగుతున్నది. అప్రతిహతంగా దూసుకెళ్తున్న రోహిత్ సేన ఇంగ్లండ్ను చిత్తు చేసి మెగాటోర్నీలో ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం లక్నో వేదికగా జరిగిన పోరులో భారత్ 100 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను మట్టికరిపించింది. ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ నెగ్గిన భారత్ దాదాపు సెమీఫైనల్లో అడుగుపెట్టగా.. మరోవైపు ఆరింట కేవలం ఒకే మ్యాచ్లో నెగ్గిన ఇంగ్లిష్ టీమ్ అధికారికంగా నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్.. టీమ్ఇండియాను బ్యాటింగ్కు ఆహ్వానించగా.. ఈ ప్రపంచకప్లో తొలిసారి లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం దక్కిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా.. టాపార్డర్ విఫలం కాగా.. బంతి కాస్త ఆగి వస్తున్న స్లో పిచ్పై మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్ (39) రాణించారు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (9) ఎక్కువసేపు నిలువలేకపోగా.. కోహ్లీ (0) వరల్డ్కప్ చరిత్రలో తొలిసారి డకౌటయ్యాడు.
చివర్లో జస్ప్రీత్ బుమ్రా (16), కుల్దీప్ యాదవ్ (9 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3.. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఊరించే లక్ష్యఛేదనలో ఇంగ్లిష్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. కనీసం ఒక్కరైనా పోరాట పటిమ కనబర్చలేకపోయారు. ఫలితంగా ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. లియామ్ లివింగ్స్టోన్ (27) టాప్ స్కోరర్ కాగా.. జో రూట్ (0), బెన్ స్టోక్స్ (0), జానీ బెయిర్స్టో (14), డేవిడ్ మలాన్ (16), జోస్ బట్లర్ (10), మోయిన్ అలీ (15), క్రిస్ వోక్స్ (10) విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 4, బుమ్రా 3 వికెట్లు పడగొట్టారు. రోహిత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మెగాటోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్లో గురువారం శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్
‘క్లాస్రూమ్లో ఎవడైనా జవాబు చెబుతాడు.. కానీ పరీక్షలో సరిగ్గా రాసినవాడే టాపర్ అవుతాడు’ అనే సినిమా డైలాగ్ లాగా.. ప్రస్తుత తరంలో తాను ఎందుకు ప్రత్యేకమో రోహిత్ శర్మ మరోసారి నిరూపించాడు. ప్రపంచకప్లో ఈ మ్యాచ్కు ముందు వరకు భారత్ ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ చేజింగ్ చేయగా.. అందులో దాదాపు అన్నీ మ్యాచ్ల్లో రోహిత్ వందకు పైగా స్ట్రయిక్రేట్తో రెచ్చిపోయాడు. జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వడమే తన ప్రథమ కర్తవ్యం అన్నట్లు చెలరేగిపోయాడు. అయితే తొలిసారి మెగాటోర్నీలో భారత బ్యాటింగ్కు పరీక్ష ఎదురైంది. పిచ్ నుంచి సహకారం లభిస్తుండటంతో ఇంగ్లిష్ సీమర్లు రెచ్చిపోతుంటే.. భారత్ 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును నడిపించాల్సిన బాధ్యతను భుజానెత్తుకున్న రోహిత్ శర్మ.. తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబట్టాడు.
పవర్ప్లేలో బౌలర్లను చీల్చి చెండాడుతాడని పేరున్న రోహిత్ ఒక దశలో బౌండ్రీలు కొట్టడమే మరిచిపోయినట్లు తన వికెట్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఎప్పుడో అరుదుగా గానీ డకౌట్ కాని విరాట్ వెనుదిరగడంతో హిట్టింగ్ నుంచి సెట్టింగ్కు మారిన రోహిత్.. 37వ ఓవర్ వరకు క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్కు ఇరుసులా నిలిచాడు. వరల్డ్కప్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడిన తొలి మ్యాచ్లో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమ్ఇండియాను విరాట్ ఎలా ఆదుకున్నాడో.. అచ్చం అలాగే రోహిత్ నేనున్నానని నిలబడ్డాడు. బ్యాటింగ్కు కష్టతరమైన పిచ్పై చక్కటి ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్ సెంచరీకి చేరువైన తర్వాత ఔట్ కాగా.. రాహుల్, సూర్యకుమార్ చక్కటి బ్యాటింగ్తో భారత జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది.
ఎప్పుడో గానీ ఇలాంటిది జరగదు. పేస్ బౌలర్లు పరిస్థితులను చక్కగా అర్థం చేసుకున్నారు. పిచ్ నుంచి కాస్త సహకారం లభిస్తుండటంతో బుమ్రా, షమీ చెలరేగిపోయారు. జట్టులో సీమర్లకు తోడు మంచి స్పిన్నర్లు ఉండటం కలిసొచ్చింది. ప్రతి ఒక్కరు బాధ్యత గుర్తెరిగి ఆడారు. మొదటి ఐదు మ్యాచ్ల్లో చేజింగ్ చేస్తే.. ఈసారి టార్గేట్ నిర్దేశించాల్సి వచ్చింది. పిచ్ బ్యాటింగ్కు కాస్త కష్టంగా ఉండటంతో వీలైనన్ని పరుగులు చేసి బౌలర్లకు బాధ్యతలు ఇవ్వాలనుకున్నాం. అయినా అనుకున్న దానికంటే 30 పరుగుల వరకు తక్కువ చేశాం. తొలి పవర్ప్లేలో మూడు వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది.
కనీసం పోరాడకుండానే!
ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇంగ్లండ్ ఈ సారి కూడా అదే పేలవ ఆటతీరు కనబర్చింది. పదో స్థానం వరకు హిట్టర్లతో నిండి ఉన్న ఇంగ్లిష్ టీమ్ ముందు స్వల్ప లక్ష్యమే నిలిచినా.. నాణ్యమైన భారత పేస్ను ఎదుర్కోలేక బట్లర్ సేన చేతులెత్తేసింది. మలాన్ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా వికెట్ల పతనానికి తెరతీయగా.. ఇక చివరి వరకు ఆ పరంపర కొనసాగింది. ముఖ్యంగా ప్రపంచకప్లో తొలి నాలుగు మ్యాచ్లకు దూరమైన సీనియర్ పేసర్ షమీ.. తనను పక్కనపెట్టి భారత టీమ్ మేనేజ్మెంట్ ఎంత పెద్ద తప్పు చేసిందో మరోసారి నిరూపించాడు.
గత మ్యాచ్లో న్యూజిలాండ్పై 5 వికెట్లు పడగొట్టిన షమీ.. ఈసారి నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అసలు షమీ బంతిని ఎదుర్కోవాలంటేనే ఇంగ్లండ్ బ్యాటర్లు వణికిపోయారనడంలో అతిశయోక్తి లేదు. తొలి ఐదు ఓవర్లలో అతడు 2 మెయిడెన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అందులో బెన్స్టోక్స్, బెయిర్స్టో, మోయిన్ అలీ వికెట్లు ఉన్నాయి. ఒక ఎండ్ నుంచి బుమ్రా ఒత్తిడి తెస్తుంటే.. మరో ఎండ్ నుంచి షమీ విజృంభించాడు. వీరిద్దరి బౌలింగ్ వాడికి నలిగిపోయిన ఇంగ్లిష్ ప్లేయర్లు ఒకరి వెంట ఒకరు డ్రెస్సింగ్ రూమ్కు క్యూ కట్టారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 229/9 (రోహిత్ 87; సూర్యకుమార్ 49; విల్లీ 3/45, వోక్స్ 2/33), ఇంగ్లండ్: 34.5 ఓవర్లలో 129 ఆలౌట్ (లివింగ్ స్టోన్ 27; షమీ 4/22,
బుమ్రా 3/32).