Team India | ఆసియాకప్లో ఇప్పటికే ఫైనల్కు దూసుకెళ్లిన భారత్.. శుక్రవారం బంగ్లాదేశ్తో నామమాత్రమైన పోరులో బరిలోకి దిగనుంది. సూపర్-4లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ టీమ్ఇండియా విజయాలు సాధించి 4 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిస్తే.. మరోవైపు బంగ్లాదేశ్ ఆడిన రెండింట్లోనూ ఓడి ఫైనల్ రేసుకు దూరమైంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కు పెద్దగా ప్రాధాన్యత లేకపోగా.. మరి నామమాత్ర పోరులో స్టార్ ప్లేయర్లను ఆడిస్తారా లేక విశ్రాంతినిస్తారా చూడాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్కు రెస్ట్ ఇచ్చి వారి స్థానాల్లో ఇంతవరకు అవకాశం దక్కక ఎదురుచూస్తున్న వారిని ఆడించే అవకాశాలు లేకపోలేదు. తొలి సారి భారత వన్డే జట్టుకు ఎంపికైన తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డే అరంగేంట్రం చేయలేదు. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా బెంచ్కే పరిమితమయ్యాడు.
వర్క్లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకొని భారత జట్టు మార్పులు చేస్తుందా.. లేక వన్డే ప్రపంచకప్నకు ముందు కూర్పు సరిచూసుకునేందుకు అలాగే కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరం. ముఖ్యంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఒత్తిడి పడకుండా.. అతడికి రెస్ట్ ఇచ్చి మహమ్మద్ షమీకి అవకాశమివ్వొచ్చు. ఫలితంలో పెద్దగా ప్రభావం లేకపోయినా.. ఫైనల్కు ముందు జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరగాలంటే ఫుల్ సైన్యంతోనే బరిలోకి దిగాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. హైదరాబాదీ పేసర్ సిరాజ్కు విశ్రాంతినిచ్చే అకాశాలను కొట్టి పారేయలేం. రోహిత్కు రెస్ట్ ఇస్తే.. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహించనున్నాడు.