పరిమిత ఓవర్ల క్రికెట్లో పరిమితుల్లేకుండా దూసుకెళ్తున్న టీమ్ఇండియా.. సొంతగడ్డపై టెస్టు సవాల్కు సిద్ధమైంది. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియన్లను వారి గడ్డపైనే చిత్తుచేసి సగర్వంగా ‘బోర్డర్-గవాస్కర్’ట్రోఫీ ముద్దాడిన టీమ్ఇండియా.. ఈ సారి స్వదేశంలో సత్తాచాటేందుకు రెడీ అయింది!
ఈ సిరీస్తోనే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించాలనుకుంటున్న భారత్.. పనిలో పనిగా టెస్టుల్లోనూ నంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది! గతంతో పోలిస్తే మాటల యుద్ధాలు పెద్దగా లేకపోయినా.. సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఇరు జట్ల మధ్య రేసు రసవత్తరంగా సాగడం ఖాయమే! నిన్న మొన్నటి వరకు వన్డే, టీ20 మజా ఆస్వాదించిన అభిమానులంతా ఇక టెస్టు ఫార్మాట్కు ట్యూన్ అయిపోండి! మరింకెందుకు ఆలస్యం ఉదయం తొమ్మిదిన్నర నుంచే మహా సంగ్రామం!!
యువ ఆటగాళ్లంతా చక్కటి ఫామ్లో ఉన్నారు. అందులో నుంచి 11 మందిని ఎంపిక చేయడం కష్టమే. పరిస్థితులకు తగ్గట్టే జట్టు ఎంపిక ఉటుందని అందరికీ చెప్పాం. అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది జట్టును ఎంపిక చేస్తాం
– రోహిత్, భారత కెప్టెన్
నాగ్పూర్: స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్ఫైట్కు సమాయత్తమైంది. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్పై టీ20, వన్డే సిరీస్లు నెగ్గిన టీమ్ఇండియా నేటి నుంచి ఆసీస్తో ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’సిరీస్ ఆడనుంది. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా గురువారం నాగ్పూర్ వేదికగా తొలి టెస్టుకు తెరలేవనుంది. సీనియర్లు, జూనియర్ల కలయికతో రోహిత్ సేన బలంగా కనిపిస్తుంటే.. గత మూడు పర్యాయాలు ట్రోఫీ చేజార్చుకున్న ఆసీస్ ఈ సారి ఎలాగైనా విజేతగా నిలువాలని కృతనిశ్చయంతో ఉంది.
యాషెస్ సిరీస్ కంటే భారత్పై విజయమే పెద్దదని ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ పేర్కొనగా.. అశ్విన్ స్పిన్ ఉచ్చును ఛేదించడం ఎలాగో తమకు తెలుసని స్మిత్ అన్నాడు. పిచ్పై అనవసర రాద్ధాంతం అవసరం లేదని భారత సారథి రోహిత్ శర్మ స్పష్టం చేయగా.. తుది జట్టు ఎంపిక భారత్కు ఇబ్బందికరంగా మారింది. యువ ఆటగాళ్లంతా మంచి ఫామ్లో ఉండటంతో 11 మందిని ఎంపిక చేసేందుకు మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. మూడు ఫార్మాట్లలో సారథ్య బాధ్యతలు అందుకున్నాక రోహిత్ శర్మకు ఆసీస్ రూపంలో ప్రధాన సవాల్ ఎదురుకానుండగా.. కెప్టెన్సీ భారం లేని విరాట్ విజృంభించేందుకు సిద్ధమవుతున్నాడు. పుజారా, అశ్విన్, జడేజా, షమీ, సిరాజ్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం పక్కా కాగా.. మిగిలిన స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది.
వన్డేల్లో వీర విహారం చేస్తున్న శుభ్మన్ గిల్ను ఓపెనర్గా ఎంపిక చేసి కేఎల్ రాహుల్ను మిడిలార్డర్లో ఆడిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ రాహుల్ ఓపెనింగ్ చేస్తే.. మిడిలార్డర్లో గిల్ను కాదని సూర్యకుమార్ను ఎంపిక చేసే అవకాశాలనూ కొట్టి పారేయలేం. ఎటొచ్చి ఈ ముగ్గురిలో ఇద్దరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కనుంది. ఇక వికెట్ కీపర్గా ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ అరంగేట్రం చేస్తాడా.. లేక ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. మూడో స్పిన్నర్గా అక్షర్ పటేల్, కుల్దీప్యాదవ్లో ఎవరికి చాన్స్ దక్కుతుందో చూడాలి.
పిచ్, వాతావరణం నాగ్పూర్ పిచ్ స్పిన్కు అనుకూలించనుంది. మ్యాచ్కు వర్ష సూచనలేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్/రాహుల్, పుజారా, కోహ్లీ, జడేజా, గిల్/సూర్య, భరత్/ఇషాన్, అశ్విన్, అక్షర్/కుల్దీప్, షమీ, సిరాజ్.
ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఖవాజా, లబుషేన్, స్మిత్, హెడ్, హ్యాండ్స్కోంబ్, కారీ, అగర్, లియాన్, బొలాండ్.