గతేడాది టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే వెనుతిరిగిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని కసి మీద ఉంది. అందుకే ప్రపంచకప్ ఆడే జట్టును ఎంపిక చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవం గంగూలీ స్పందించాడు.
ఐసీసీ టోర్నీ ఉన్న ఏడాదిలో ఇన్ని ప్రయోగాలు అవసరమా? అని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి తాము ఇంకా ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయలేదని చెప్పాడు. వచ్చే ఇంగ్లండ్ సిరీస్ నుంచి టీ20 ప్రపంచకప్ జట్టు కోసం కృషి ఉంటుందని అంచనా వేశాడీ టీమిండియా మాజీ సారధి.
ఈ విషయంపై ఇంగ్లండ్ సిరీస్ నుంచే ద్రావిడ్ ఫోకస్ పెడతాడని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. ఇంగ్లండ్లో ఆడే జట్టులోనే వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ఉంటారని ఊహించాడు. ‘‘రాహుల్ ద్రావిడ్ ఈ విషయంపై దృష్టి పెట్టాడు. ఏదో ఒక దశలో ఒక సెటిల్డ్ జట్టును ఎంపిక చేయాలని అతను ఆలోచిస్తున్నాడు.
వచ్చే నెలలో జరిగే ఇంగ్లండ్ పర్యటనలో మనం ఆ జట్టును చూస్తామేమో? ఆ సిరీస్లో ఆడే వాళ్లనే ప్రపంచకప్లో చూసే అవకాశం ఉంది’’ అని గంగూలీ చెప్పాడు. ప్రస్తుతానికైతే భారత యువ ఆటగాళ్లలో ఇషాన్ కిషన్, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వకు కుమార్, ఆవేష్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను మెరుగు పరుచుకున్నారు.
అదే సమయంలో రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ పేలవ ప్రదర్శనతో వెనుకబడ్డారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఐర్లాండ్ సిరీస్లో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టుతో చేరనుండటంతో.. పంత్, శ్రేయాస్పై మరింత ఒత్తిడి పడనుంది.