మాంచెస్టర్: ఇంగ్లండ్లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టులోని సపోర్ట్ స్టాఫ్కు కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో కోహ్లీసేన ట్రైనింగ్ను రద్దు చేసినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా వెల్లడైంది. ఓల్డ్ ట్రాఫర్డ్లో శుక్రవారం నుంచి ఇంగ్లండ్, ఇండియా మధ్య అయిదో టెస్టు ప్రారంభం కావాల్సి ఉన్నది. ఆ టెస్టు జరగడం అనుమానంగా తోస్తోంది. అయితే భారత కోచ్ రవిశాస్త్రికి కూడా కరోనా వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. ఓ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో రవిశాస్త్రితో పాటు విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్నారు. చాలా రద్దీ ఉన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ ఇద్దరిపై బీసీసీఐ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రవిశాస్త్రి, భరత్ అరున్, ఆర్ శ్రీధర్లను క్వారెంటైన్లో ఉంచారు. అయితే ఇప్పటి వరకు జట్టులోని ప్లేయర్లకు ఎవ్వరికీ వైరస్ సోకలేదు. కానీ సపోర్ట్ స్టాఫ్తో సన్నిహితంగా ఉన్న కారణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయిదు టెస్టులో సిరీస్లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
కోచ్లు పాజిటివ్గా తేలడంతో.. ప్లేయర్లందరికీ ఆర్టీ-పీసీర్ పరీక్షలు చేయించారు. మాంచెస్టర్లో ఉన్న జట్టు సభ్యులతో సంప్రదించిన బీసీసీఐ.. ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టును రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో.. ఆ టోర్నమెంట్పై ఎటువంటి ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో బీసీసీఐ ఉన్నది. అందుకే రేపటి నుంచి ప్రారంభం అయ్యే అయిదో టెస్టు చివరి వరకు స్టార్ట్ అయ్యేది డౌటే.
ప్లేయర్లందరినీ హోటల్ రూమ్కే పరిమితం కావాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం కొత్తగా టెస్టింగ్ చేసిన తర్వాత మరొకరికి కరోనా సోకినట్లు తేలింది. గురువారం ఉదయం కూడా టెస్టింగ్ చేశారు. ఆ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. నాలుగవ టెస్ట్ సమయంలో వైరస్ సోకిన కోచ్లను.. జట్టుతో పాటు మాంచెస్టర్కు రానివ్వలేదు. టీమ్ ఫిజియో నితిన్ పటేల్ను కూడా క్వారెంటైన్లో ఉంచారు. యూకే ప్రభుత్వ రూల్స్ ప్రకారం పాజిటివ్ వచ్చిన వాళ్లు పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలి. ఆ తర్వాత రెండు సార్లు నెగటివ్ వస్తేనే వాళ్లు బయటకు వెళ్లాలి. ప్రస్తుతం లండన్లోనే రవిశాస్త్రి, అరుణ్, శ్రీధర్లు క్వారెంటైన్లో ఉన్నారు.