Team India | వన్డే ప్రపంచకప్లో భాగంగా వరుస విజయాలతో జోరు మీదున్న టీమ్ఇండియా.. గురువారం ముంబై వాంఖడే వేదికగా శ్రీలంకతో అమీతుమీకి సిద్ధమైంది. మెగాటోర్నీలో భాగంగా ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో నెగ్గిన భారత్ 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. మరోవైపు శ్రీలంక లయ అందుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది. లంకతో పోరు కోసం ఇప్పటికే ముంబైలో అడుగుపెట్టిన రోహిత్ సేన మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్లో పాల్గొంది.
తాజా టోర్నీలో షార్ట్ పిచ్ బంతులను ఆడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న శ్రేయస్ అయ్యర్ ఆ లోపాన్ని అధిగమించేందుకు నెట్స్లో చెమటోడ్చాడు. వరుసగా షార్ట్ పిచ్ బంతులకు పుల్ షాట్లు ఆడుతూ కనిపించాడు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ముంబైలో జట్టుతో చేరనుండటంతో అతడు ఫిట్నెస్ సాధిస్తే.. తుది జట్టు నుంచి శ్రేయస్కు ఉధ్వసన తప్పదనే వాదనల మధ్య అయ్యర్.. నెట్స్లో కఠోర సాధన చేస్తున్నాడు. త్రో డౌన్ స్పెషలిస్ట్లతో పదే పదే షార్ట్ పిచ్ బంతులు వేయించుకొని వాటిని ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు.
హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ఏకైక ఆల్రౌండర్గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా.. బిగ్ హిట్టింగ్పై దృష్టి పెట్టాడు. మంగళవారం ఐచ్ఛిక ప్రాక్టీస్ అయినా.. జట్టులోని పలువురు ప్లేయర్లు మైదానంలోకి రాగా.. జడేజా భారీ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తు జట్టులో సూర్యకుమార్ యాదవ్తో పాటు రవీంద్ర జడేజా ఫినిషింగ్లో కీలకం కానున్న నేపథ్యంలో జడ్డూ ఆ దిశగా దృష్టి పెట్టినట్లు అర్థమవుతుంది. ప్రధాన ఆటగాళ్లు ప్రాక్టీస్కు దూరంగా ఉండగా.. శ్రేయస్, జడేజా, అశ్విన్, శార్దూల్ నెట్స్లో ఎక్కువ శ్రమిస్తూ కనిపించారు.