Team India | భారత జట్టు ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో పర్యటిస్తోంది. విండీస్ (West Indies)తో జరిగిన తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించి ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నెల 20 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. అది పూర్తయ్యాక రోహిత్ (Rohit Sharma) సేన ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్లో తలపడుతుంది. ఆసియా కప్ (Asia Cup), వన్డే ప్రపంచకప్ (ODI World Cup)కు ముందు భారత్కు ఇది చాలా ముఖ్యమైన సిరీస్. దాదాపు నాలుగు నెలల తర్వాత భారత జట్టు బ్లూ జెర్సీతో రంగంలోకి దిగబోతోంది. ఈ పర్యటనలో అభిమానుల దృష్టంతా ఐదుగురు ఆటగాళ్లపైనే ఉంది. మైదానంలో బెబ్బులిలా విరుచుకుపడే వీరు జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించగల సామర్థ్యం ఉన్నవారు. ఈ సిరీస్లోనూ విజృంభించడం ద్వారా వన్డే ప్రపంచకప్ జట్టులో చోటును ఖాయం చేసుకోవాలని భావిస్తున్నారు. వారెవరో.. వారి ఆటతీరు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.
టీమిండియా యువకెరటం శుభమన్ గిల్ (Shubman Gill)పై తన అద్భుత ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో ఇప్పుడతడిపై ఎన్నో అంచనాలున్నాయి. ముఖ్యంగా ప్రపంచకప్లో అతడు విధ్వంసం సృష్టించాలని కోరుకుంటున్నారు. న్యూజిలాండ్తో హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి బ్యాటింగ్ మాంత్రికుడిగా మారాడు. ఆ ఇన్నింగ్స్తో గిల్ వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన ఇండియన్గా రికార్డులకెక్కాడు. అయితే, ఆస్ట్రేలియా సిరీస్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. మూడు వన్డేల్లో చేసింది 57 పరుగులు మాత్రమే. విండీస్తో త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్లో మరోమారు దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నాడు.
వికెట్కీపర్ బ్యాటర్ అయిన సంజు శాంసన్ (Sanju Samson) టీమిండియాకు అదనపు బలం. ప్రపంచకప్ ముందు తనలోని ప్రతిభకు మరింత పదును పెట్టడం ద్వారా జట్టులో చోటు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. గతేడాది నవంబరులో న్యూజిలాండ్తో ఈడెన్పార్క్లో వన్డే మ్యాచ్ ఆడిన తర్వాత ఇప్పటి వరకు మరో మ్యాచ్ ఆడలేదు. ఈ నేపథ్యంలో కరీబియన్ గడ్డపై ఇరగదీయడం ద్వారా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నాడు. 28 ఏళ్ల సంజు 11 వన్డేలు ఆడి పది ఇన్నింగ్స్లో 104.76 స్ట్రైక్రేట్తో 330 పరుగులు చేశాడు. ప్రపంచకప్లో నాణ్యమైన వికెట్ కీపర్ బ్యాటర్ కోసం జట్టు మేనేజ్మెంట్ చూస్తోంది. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్పై పెద్దగా ఆశలు లేకపోవడంతో ఇప్పుడు ఆశలన్నీ సంజూపైనే ఉన్నాయి. ఇప్పటికే బోల్డంత దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ ఆడిన శాంసన్ జట్టులో వికెట్ కీపర్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఒకడు. కష్టాల్లో ఉన్న జట్టును బయటపడేయంలో జడేజా దిట్ట. బంతితోనూ మ్యాజిక్ చేయగలడు. బౌలింగ్ విభాగంలో అతడి నుంచి జట్టు అత్యుత్తమ ప్రదర్శన కోరుకుంటోంది. మోకాలి గాయం తర్వాత మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్తో తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే, మూడు మ్యాచ్ల ఆ సిరీస్లో 4.21 ఎకానమీతో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బ్యాటింగులోనూ పెద్దగా రాణించలేకపోయాడు. ప్రపంచకప్, ఆసియాకప్కు ముందు తిరిగి ఫామ్లోకి రావాలని, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. విండీస్తో ఇప్పటి వరకు 29 వన్డేలు ఆడిన 34 ఏళ్ల జడేజా 4.87 ఎకానమీతో 41 వికెట్లు తీసుకున్నాడు.
మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఇటీవలి కాలంలో భారత జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీరుస్తున్నాడు. త్వరగా వికెట్లు తీయడం ద్వారా ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడంలో సఫలమవుతున్నాడు. సిరాజ్ తొలిసారి 2022లో విండీస్లో పర్యటించాడు. మూడు మ్యాచుల్లో 3.57 ఎకానమీతో ఐదు వికెట్లు తీసుకున్నాడు. విండీస్తో త్వరలో జరగనున్న వన్డే సిరీస్లో తన పేస్, స్వింగ్తో మైదానంలో విధ్వంసం సృష్టించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే విండీస్పై చెలరేగిపోవాలని భావిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 8 గేమ్స్ ఆడిన సిరాజ్ 4.61 ఎకానమీతో 19 వికెట్లు తీసుకున్నాడు. జనవరిలో శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో 4.05 ఎకానమీతో 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
వైట్బాల్ క్రికెట్లో యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) దాడి మామూలుగా ఉండదు మరి. అయితే, ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు రెండు వన్డేలు మాత్రమే ఆడాడు.5.82 ఎకానమీతో మూడు వికెట్లు తీసుకున్నాడు. ప్రపంచకప్కు ముందు తనను తాను మరోమారు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు కోసం ఇప్పటి నుంచే ఆత్మవిశ్వాసం పెంచుకోవాల్సి ఉంటుంది. అది రావాలంటే ఈ సిరీస్లో అత్యద్భుత ప్రతిభ కనబర్చాలి. విండీస్పై పది మ్యాచుల్లో 5.40 ఎకానమీతో 20 వికెట్లు తీసుకున్నాడు. కరీబియన్ గడ్డపై నాలుగు మ్యాచుల్లో 5.86 ఎకానమీతో 8 మంది బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు.