ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ కష్టాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం భారత జట్టును వెనక్కులాగుతోంది. దీనిపై భారత మాజీ దిగ్గజం వసీం జాఫర్ స్పందించాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఫేవరెట్లుగా బరిలో దిగిన భారత్ ఓటమి చవిచూడగా.. ఆ తర్వాత టీ20, వన్డే సిరీస్లకు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సిరీసుల్లో కూడా భారత టాపార్డర్ మురిపించలేకపోయింది. ఇదే విషయాన్ని ఎత్తిచూపిన జాఫర్.. ‘‘మొదటి ముగ్గురు ప్లేయర్లు మంచి స్కోర్లు చేస్తున్నప్పుడు టీమిండియా అద్భుతంగా రాణించింది. కానీ చివరి రెండు వన్డేల్లో అది కనిపించలేదు. విరాట్ కోహ్లీ పామ్ లేక తడబడుతున్నాడు. ధవన్ చాలా ఇబ్బందిగా కనిపిస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం టీమిండియా యాజమాన్యం ఈ విషయంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నాడు. అలాగే తొలి వన్డేలో 76 పరుగులతో అలరించిన రోహిత్.. అదే ఫామ్ కంటిన్యూ చెయ్యలేకపోయాడని గుర్తుచేశాడు. లార్డ్స్లో జరిగిన రెండో వన్డేలో రోహిత్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే.
మిడిలార్డర్ రాణించి భారత జట్టు సిరీస్ గెలవడం పట్ల రోహిత్ సంతోషంగా ఉండొచ్చు, కానీ అతను కూడా ఆశించిన స్థాయిలో నిలకడగా రాణించడం లేదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే వారం ప్రారంభమయ్యే విండీస్ పర్యటనలో వన్డే సిరీస్కు నాయకత్వం వహించనున్న ధవన్ బ్యాటింగ్పై అందరి ఫోకస్ పెరగనుంది. అలాగే ఆ తర్వాత జరిగే టీ20 సిరీస్లో రోహిత్ జట్టుతో చేరనున్నాడు. మరి అక్కడైనా నిలకడగా రాణిస్తాడేమో చూడాలి.