టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. గ్రూప్-2లో భాగంగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట నెగ్గిన రోహిత్ సేన నేడు జింబాబ్వేతో అమీతుమీకి సిద్ధమైంది. సూపర్-12 దశలో ఇదే చివరి మ్యాచ్ కాగా.. భారత జట్టు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ముందుకు సాగాలంటే విజయం తప్పనిసరి. మెగాటోర్నీలో పాకిస్థాన్కు షాకిచ్చిన జింబాబ్వే.. రోహిత్ సేనను కూడా నిలువరించాలని చూస్తుంటే.. టాపార్డర్ సమష్టిగా సత్తాచాటాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది.
మెల్బోర్న్: దాయాది పాకిస్థాన్పై విజయంతో టీ20 వరల్డ్కప్ సూపర్-12 దశను ఘనంగా ఆరంభించిన భారత్.. ఆదివారం చివరి పోరులో జింబాబ్వేతో తలపడనుంది. గ్రూప్-2లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట నెగ్గి.. ఒక పరాజయంతో 6 పాయింట్లతో ఉన్న టీమ్ఇండియా ఈ మ్యాచ్ నెగ్గి అగ్రస్థానంతోనే సెమీస్కు చేరాలని చూస్తున్నది. ఇప్పటికే గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీస్ బెర్త్లు ఖరారు చేసుకోగా.. గ్రూప్-2 నుంచి ఆరు జట్లు ఆదివారం మైదానంలో దిగనున్నాయి. విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్లో ఉండటం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం కాగా.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. వీరిద్దరూ చెరో మ్యాచ్లో హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నా.. కలిసికట్టుగా రాణించడంలో విఫలమవుతున్నారు.
కోహ్లీతో పాటు సూర్యకుమార్ ఫుల్ జోష్లో ఉండగా.. హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్లు ఆశిస్తున్నది. అక్షర్ పటేల్ తన ఆల్రౌండర్ స్థానానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అర్శ్దీప్ సింగ్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ పేస్ భారాన్ని మోయనుండగా.. అశ్విన్ పరుగుల నియంత్రణపై దృష్టి పెట్టక తప్పని పరిస్థితి. మరోవైపు ఇటీవలి కాలంలో మెరుగైన ప్రదర్శన చేస్తున్న జింబాబ్వేను తక్కువ అంచనావేస్తే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం లేకపోలేదు. తాజా టోర్నీలో ఆ జట్టు పాకిస్థాన్పై గెలిచిందనే విషయం మరవొద్దు. సికందర్ రజా, ఎర్విన్, సీన్ విలియమ్స్, ముజర్బాని రూపంలో ఆ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పాండ్యా, కార్తీక్, అక్షర్, అశ్విన్, భువనేశ్వర్, షమీ, అర్శ్దీప్.
జింబాబ్వే: ఎర్విన్ (కెప్టెన్), మధవెరె, చకబ్వా, సీన్ విలియమ్స్, సింకందర్, మిల్టాన్, ర్యాన్, జాంగ్వే, రిచర్డ్, చటారా, ముజర్బాని.
పిచ్, వాతావరణం
మెల్బోర్న్ పిచ్ పేస్కు సహకరించనుంది. కాస్త కుదురుకుంటే పరుగులు చేయడం కష్టం కాదు. మెగాటోర్నీలో భాగంగా ఇక్కడ జరుగాల్సిన గత మూడు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ మ్యాచ్కు వరుణుడి ముప్పు లేదు.
పెద్ద కేక్ కోస్తా: కోహ్లీ
రన్మెషీన్ విరాట్ కోహ్లీ 34వ పుట్టిన రోజు (శనివారం) సందర్భంగా జట్టు సభ్యులతో కలిసి సంబురాలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన కోహ్లీ.. తాను ఈ నెల 13న (ప్రపంచకప్ ఫైనల్) దీని కన్నా పెద్ద కేక్ కోయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కోహ్లీ బర్త్డే సందర్భంగా క్రీడాలోకం అతడికి శుభాకాంక్షలు తెలిపింది.