T20 World Cup 2024 : సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ చేజార్చుకున్న భారత్ టీ20 ప్రపంచ కప్పై గురి పెట్టింది. ఐపీఎల్ 17వ సీజన్ తర్వాత జరిగే ఈ మెగా టోర్నీలో ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)ని ఒడిసిపట్టాలనే కసితో ఉంది. ప్రపంచకప్లో రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనునుండగా.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)ని పక్కనపెడతారానే వదంతులు వినిపిస్తున్నాయి. అమెరికా, వెస్టిండీస్లోని స్లో పిచ్లపై కోహ్లీ ఆడలేడని, అందుకే విరాట్ను ఒప్పించేందుకు బీసీసీఐ పెద్దలు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్(Kris Srikkanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచకప్ స్క్వాడ్లో కోహ్లీ కచ్చితంగా ఉండాలని, అతడు టీమిండియా ట్రంప్ కార్డు అని శ్రీకాంత్ తెలిపాడు. ‘వరల్డ్ కప్లో కోహ్లీ లేకుండా భారత జట్టు ఆడే చాన్సే లేదు. 2022లో టీమిండియాను సెమీస్ చేర్చింది అతడే. అంతేకాదు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ కూడా. ప్రపంచకప్ స్క్వాడ్లో కోహ్లీ ఉండడని ఎవరు చెప్పారు? ఈ తప్పుడు వార్తలను ఎవరు ప్రచారం చేస్తున్నారు?. వాళ్లకు వేరే పనిలేదా? ఏ కారణంతో కోహ్లీని పక్కనపెడతారు?.. నేను అడిగే ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా. భారత జట్టు ప్రపంచకప్ గెలవాలంటే కోహ్లీ జట్టులో ఉండాల్సిందే’ అని శ్రీకాంత్ తన యూట్యూబ్ షోలో వెల్లడించాడు.
ఏడాది కాలంగా టీ20లకు దూరమైన విరాట్ కోహ్లీ అఫ్గనిస్థాన్ సిరీస్తో జట్టులోకి వచ్చాడు. రెండో టీ20లో 16 బంతుల్లోనే 29 రన్స్ కొట్టాడు. అయితే.. పొట్టి ఫార్మాట్లో అతడి స్ట్రయిక్ రేటు మెరుగ్గా లేదనేది కొందరి వాదన. కానీ, 2022 వరల్డ్ కప్లో కోహ్లీ 6 మ్యాచుల్లోనే 296 రన్స్ కొట్టాడు. పాకిస్థాన్పై ఓటమి తప్పదనుకున్న దశలో కింగ్ కోహ్లీ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. 82 పరుగులతో నాటౌట్గా నిలిచి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
కోహ్లీ (82 నాటౌట్)
ఓ ఎండ్లో క్రీజులో పాతుకుపోయి చివరి ఓవర్ వరకూ ఆడగల సత్తా ఉన్నా కోహ్లీ జట్టులో ఉండడం ఎంతో ముఖ్యం. పైగా ఐపీఎల్లో అతడు నిరుడు వరుస సెంచరీలతో కదం తొక్కాడు. వెస్టిండీస్, అమెరికాలోని స్లో పిచ్లపై విరాట్ అదరగొడతాడని కోట్లాది మంది ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత కోహ్లీ మళ్లీ మైదానంలో దిగలేదు. అతడి భార్య అనుష్క శర్మ(Anushka Sharma) రెండో బిడ్డను కనడంతో లండన్లోనే ఉండిపోయాడు. మరో వారంలో ఐపీఎల్ 17వ సీజన్ మొదలవ్వనుంది. అయితే.. విరాట్ స్వదేశానికి ఎప్పుడు వస్తాడు? అనేది తెలియాల్సి ఉంది. ఐపీఎల్ 17వ సీజన్కు మార్చి 22న 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలిపోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ తలపడనున్నాయి.