ODI WC – 2023 : ఈ ఏడాది సొంత గడ్డపై వరల్డ్ కప్(ODI World Cup – 2023) జరుగనుంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)ని ముద్దాడడానికి భారత జట్టుకు ఇదొక సువర్ణావకాశం. ప్రపంచంలోని మేటి జట్లలో ఒకటైన రోహిత్ శర్మ(Rohit Sharma) బృందానికి ఇంతకంటే మంచి తరుణం ఉండదు. అయితే.. మెగా టోర్నీకి రెండు నెలలే సమయం ఉంది. కానీ, జట్టు కూర్పు ఇంకా కుదరలేదు. వెస్టిండీస్పై వన్డే సిరీస్(ODI Series)లో చేసిన ప్రయోగాలతో సమాధానం దొరకలేదు. దాంతో, మళ్లీ సీనియర్లనే నమ్ముకుందామా?, కుర్రాళ్లకు చాన్స్ ఇద్దామా? అనే సందిగ్ధత వెంటాడుతోంది. దీనికి తోడూ ఎవరిని ఏ స్థానంలో ఆడించాలి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అయింది. ఈసారి ప్రధానంగా ఐదు సమస్యలు టీమిండియాను కలవరపెడుతున్నాయి. అవేంటో తెలుసా..?
మిడిలార్డర్లో నాలుగో స్థానం ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే.. ఆల్రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) రిటైర్మెంట్ ప్రకటించాక.. నాలుగో స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరకడం లేదు. 2019 వరల్డ్ కప్ తర్వాత నుంచి టీమిండియాను ఈ సమస్య వేధిస్తోంది. శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer), రిషభ్ పంత్(Rishabh Pant), విజయ్ శంకర్(Vijay Shankar), కేఎల్ రాహుల్(KL Rahul), ను పరీక్షించి చూశారు. అయ్యర్ 20 ఇన్నింగ్స్ల్లో 805 పరుగులతో పర్వాలేదనిపించాడు.
యువరాజ్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, అంబటి రాయుడు
పంత్ కూడా నాలుగో స్థానంలో 16 మ్యాచుల్లో 492 రన్స్ కొట్టాడు. అయితే.. వీళ్లు యూవీలా నిలకడగా రాణించలేకపోయారు. పైగా అయ్యర్, రాహుల్ ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారు. పంత్ అయితే.. ఆడే ప్రసక్తే లేదు. అంబటి రాయుడు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఆటగురించి తెలిసిందే. ఆస్ట్రేలియాపై గోల్డ్న్ డక్తో చెత్త రికార్డు మూటగట్టుకున్న అతను 50 ఓవర్ల ఆటలో తేలిపోతున్నాడు. దాంతో, ఈసారి వరల్డ్ కప్లో ఎవరిని ఆడించాలి? అనేది హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్ద తల నొప్పిలా మారింది.
ఒకప్పుడు జహీర్ ఖాన్(Zaheer Khan), ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan), మునాఫ్ పటేల్(Munaf Patel)తో భారత పేస్ విభాగం బలంగా ఉండేది. వాళ్ల తర్వాత జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumrah), మహమ్మద్ షమీ(Shami), సిరాజ్(Siraj), ఉమేశ్ యాదవ్(Umesh Yadav), ఉమ్రాన్ మాలిక్(Umran Malik) రూపంలో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు దొరికారు. కానీ వెన్నుముక గాయం కారణంగా దాదాపు 10 నెలలు బుమ్రా ఆటకు దూరమయ్యాడు. ఈ మధ్యే కోలుకున్న అతను ఐర్లాండ్ సిరీస్తో పునరాగమనం చేస్తున్నాడు.
సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ
అయితే.. అతను మునపటిలా బౌలింగ్ చేయగలడా? యార్కర్లు సంధించగలడా? అనేది చెప్పలేం. ఈ ఏడాది షమీ, సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో వేగం ఉంది కానీ వికెట్లు తీయలేకపోతున్నాడు. దాంతో, బుమ్రా వస్తే.. మిగతా ఇద్దరు పేసర్లుగా ఎవరిని ఆడించాలి? అనేది మరో ప్రశ్న.
వరల్డ్ కప్ ముందు భారత జట్టును వికెట్ కీపింగ్ సమస్య వెంటాడుతోంది. ధోనీ(MS Dhoni) రిటైర్మెంట్ తర్వాత రిషభ్ పంత్(Rishabh Pant) రూపంలో మంచి కీపర్ దొరికాడనుకున్నాం. కారు యాక్సిడెంట్లో గాయపడిన పంత్ కోలుకునేందుకు మరో ఐదు నెలలపైనే పట్టనుంది. ఐపీఎల్ 16వ సీజన్లో గాయపడిని కేఎల్ రాహుల్(KL Rahul) ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. ఐదో స్థానంలో రాహుల్ 735 రన్స్ చేశాడు.
కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్
లోయర్ ఆర్డర్లో ఇన్నింగ్స్ నిర్మించే రాహుల్ ఒకవేళ వరల్డ్ కప్లో ఆడకుంటే జట్టుకు పెద్ద లోటే. వీళ్లిద్దరి గైర్హాజరీలో ఇషాన్ కిషన్(Ishan Kishan) వన్డేల్లో కీపర్గా జట్టులోకి వచ్చాడు. ఈ యంగ్స్టర్ వెస్టిండీస్పై మూడు వన్డేల్లో హ్యాట్రిక్ ఫిఫ్టీలతో అదరగొట్టాడు. అయితే.. అతను అదే ఫామ్ వరల్డ్ కప్లో కొనసాగిస్తాడా? అనేది కీలకం కానుంది.
భారత జట్టు ఈసారి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలంటే కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) చెలరేగి ఆడాలి. అనుభవజ్ఞులైన వీళ్లిద్దరూ ఫామ్లో ఉంటే ప్రత్యర్థులకు చుక్కలే. నిరుడు ఫామ్ అందుకున్న కోహ్లీ వరుస సెంచరీతో జోరుమీద ఉండడం శుభపరిణామం. ఈ ఏడాది 9 ఇన్నింగ్స్ల్లో విరాట్ 427 రన్స్ కొట్టాడు. రోహిత్ కూడా 383 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
అయితే.. విండీస్తో వన్డే సిరీస్లో రెండు మ్యాచ్లకు వీళ్లిద్దరూ బెంచ్కే పరిమితమయ్యారు. దాంతో, ఆగస్టు 30న మొదలవ్వనున్న ఆసియా కప్(Asia Cup 2023)లో విరాట్, హిట్మ్యాన్లో దంచి కొట్టాలని భావిస్తున్నారు. అదే జరిగితే వరల్డ్ కప్లో టీమిండియాకు ఎదురులేనట్టే.
భారత గడ్డపై స్పిన్నర్లు ఎంతగానో ప్రభావితం చూపిస్తారు. దాంతో, కనీసం ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja)కు స్పిన్నర్గా జట్టులో చోటు దాదాపు ఖాయమైనట్టే. ఇక రెండో స్పిన్నర్గా ఎవరిని తీసుకోవాలి? అనే అయోమయం నెలకొంది.
కుల్దీప్ యాదవ్, అశ్విన్, జడేజా, చాహల్
రెండో స్పిన్నర్ కోసం టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడు యజ్వేంద్ర చాహల్(Chahal), విండీస్పై వన్డేల్లో అదరగొట్టిన చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) మధ్య గట్టి పోటీ ఉంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో అక్షర్ పటేల్(Axar Patel) అద్భుతంగా రాణించాడు. పైగా ఆల్రౌండర్గా, స్పిన్నర్గా అతను మంచి చాయిస్. దాంతో, ఈ ముగ్గురిలో తుది జట్టులో ఉండేది ఎవరు? అనేది చెప్పడం కష్టమే.