IND vs WI : తొలి టెస్టులో వెస్టిండీస్(westindies)ను చిత్తు చేసిన భారత్(Team India) రెండో టెస్టులోనూ విజయంపై కన్నేసింది. టెస్టు చాంపియన్షిప్ 2023-25(WTC 2023-25) సీజన్లో తొలి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. కానీ, ఐదో రోజు కూడా వాన ముప్పు ఉందని సమాచారం. దాంతో, ఈ టెస్టులో టీమిండియా గెలుస్తుందా? లేదంటే డ్రాగా ముగుస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఐదో రోజు వరుణుడు అడ్డు తగలకుంటే విండీస్ను వైట్వాష్ చేయడం ఖాయం.
అవును.. రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్ కాపాడుకోవాలంటే 289 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయంతే. అయితే.. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన సిరాజ్, ఇప్పటికే రెండు వికెట్లు పడగొట్టిన అశ్విన్ దెబ్బకు విండీస్ బ్యాటర్లు ఎంత సేపు క్రీజులో నిలుస్తారో చూడాలి. ఈ మ్యాచ్లో విండీస్ జట్టు తంగనరైన్ చందర్పాల్(24 నాటౌట్), జర్మైన్ బ్లాక్వుడ్(20 నాటౌట్)పైనే భారీ ఆశలు పెట్టుకుంది. వీళ్లను తొందరగా ఔట్ చేయడంపైనే భారత విజయం ఆధారపడి ఉంది.
జర్మైన్ బ్లాక్వుడ్ (20 నాటౌట్), చందర్పాల్(24నాటౌట్)
పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని క్వీన్స్ పార్క్ ఓవల్(Queen’s Park Oval)లో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు అదరగొట్టింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(121) సెంచరీ, బాదడంతో తొలి ఇన్నింగ్స్లో 438 రన్స్ కొట్టింది. ఆ తర్వాత కరీబియన్లను 255కే కట్టడి చేసింది.
క్లాసిక్ సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ(121)
అయితే.. మూడో రోజు, నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ను 181 వద్ద డిక్లేర్ చేసింది. లక్ష్య ఛేదనలో అశ్విన్ దెబ్బకు విండీస్ 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. డేంజరస్ క్రెగ్ బ్రాత్వైట్(28), క్రిక్ మెకంజీ(0)లను ఔట్ చేసి యష్ ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. ఆఖరి రోజు సిరాజ్, అశ్విన్ చెలరేగితే రోహిత్ సేన విజయం నల్లేరు మీద నడకే.