ఇటీవలి కాలంలో టీమిండియాలో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసే బ్యాటర్ కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. ఇంగ్లండ్తో జరిగిన టీ20ల్లో రిషభ్ పంత్ ఓపెనింగ్ చేయగా.. ఐర్లాండ్తో మ్యాచ్లో దీపక్ హుడా ఓపెనర్ అవతారం ఎత్తాడు.
వీళ్లకుతోడు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఉండనే ఉన్నారు. అయితే వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో ఎవరూ ఊహించని విధంగా సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్గా వచ్చాడు. మిడిలార్డర్లో సెంచరీ చేసిన సూర్య ఇలా ఓపెనర్ అవతారం ఎత్తడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
అయితే ఈ విపరీత మార్పుల వెనుక ఉన్న కారణాన్ని మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ అంచనా వేశాడు. ఆడే 11 మంది జట్టులో విరాట్ కోహ్లీ స్థానాన్ని పదిలం చేయడం కోసమే జట్టు ఓపెనింగ్లో ఇన్ని మార్పులు చేయాల్సి వస్తోందని పార్థివ్ అభిప్రాయపడ్డాడు.
తుది జట్టులో విరాట్ కోహ్లీని ఉంచడం కోసమే ఓపెనింగ్ జోడీలో ఇన్ని మార్పులు చేస్తున్నట్లు తనకు అనిపిస్తోందన్నాడీ మాజీ క్రికెటర్. వెస్టిండీస్ సిరీస్కు పూర్తిగా దూరమైన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం భార్య అనుష్క శర్మతో కలిసి యూరప్ పర్యటనలో ఉన్నాడు. వీళ్లిద్దరూ యూరప్లో చెట్టాపట్టాలేసుకుంటూ.. అక్కడక్కడా అభిమానులతో కలిసి ఫొటోలు దిగుతున్న సంగతి తెలిసిందే.