Tamim Iqbal : బంగ్లాదేశ్ అభిమానులకు గుడ్న్యూస్. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) యూటర్న్ తీసుకున్నాడు. ఒక్కరోజులోనే అతను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈరోజు ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)ను కలిసిన అతను తన అభిప్రాయం మార్చుకున్నాడు. మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు ముష్రఫే మొర్తాజా(Mashrafe Mortaza), భార్య అయేషా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్మల్ హుసేన్(Nazmul Hassan)తో కలిసి హసీనా నివాసానికి వెళ్లాడు.
ఈ ఏడాది భారత్లో జరిగే వరల్డ్ కప్(ODI WC 2023)లో ఆడాల్సిందిగా ప్రధాని అతడిని కోరినట్టు సమాచారం. అందుకు అంగీకరించిన తమీమ్ మళ్లీ మైదానంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నాడు. దాంతో, దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ముష్రఫే మొర్తాజా, షేక్ హసీనా, తమీమ్ ఇక్బాల్
వన్డే కెప్టెన్గా ఉన్న తమీమ్ ఇక్బాల్ నిన్న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ పలికి అందర్నీ షాక్కు గురి చేశాడు. దాంతో, అతను తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుండు అని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ రోజు తమీమ్ ఫ్యాన్స్కు శుభవార్త చెప్పాడు. ఈసారి వరల్డ్ కప్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ బంగ్లాకు కీలకం కానున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్లకు పేరొందిన తమీమ్ అన్ని ఫార్మాట్లలో 15వేలకు పైగా పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 25 సెంచరీలు ఉన్నాయి.
తమీమ్ తప్పుకోవడంతో వన్డే కెప్టెన్గా లిట్టన్ దాస్(Litton Das) బాధ్యతలు చేపట్టాడు. మిగతా రెండు వన్డేలకు అతనే సారథ్యం వహించనున్నాడు. టెస్టు కెప్టెన్గా కొనసాగుతున్న లిట్టన్ ఈ మధ్యే బంగ్లాకు చారిత్రాత్మక విజయం అందించాడు. అఫ్గనిస్థాన్తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే.. రషీద్ ఖాన్(Rashid Khan) రాకతో పుంజుకున్న అఫ్గనిస్థాన్ తొలి వన్డేలో బంగ్లాకు షాకిచ్చింది.17 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. కీలకమైన రెండో వన్డే జూలై 8న జరగనుంది.