Jagadeesan new record | విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు వికెట్కీపర్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును ఈయన చెరిపేశారు. అరుణాచల్ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో మంచి ఫాంను కొనసాగిస్తూ 277 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇదే సమయంలో వరుసగా 5 లిస్ట్ ఏ సెంచరీలను సాధించి సెలెక్టర్లకు కొత్త సవాల్ విసిరారు. ఈ మ్యాచులో తమిళనాడు జట్టు 506 రన్స్ చేయగా.. అరుణాచల్ జట్టు కేవలం 71 పరుగులకే కుప్పకూలింది. సిద్ధార్థ్ 5 వికెట్లు తీయడంతో తమిళనాడు 435 పరుగుల తేడాతో గెలుపొందింది.
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫిలో తమిళనాడు వికెట్ కీపర్ జగదీశన్ 277 పరుగులు చేసి రికార్డులు నెలకొల్పాడు. కేవలం 76 బంతుల్లో సెంచరీ చేసిన తర్వాత మరో 38 బంతుల్లో తదుపరి 100 పరుగులు సాధించాడు. 264 పరుగుల వద్ద రోహిత్ శర్మ రికార్డును అధిగమించిన జగదీశన్.. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టి 196.45 స్రైకింగ్ రేట్తో 277 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ అలిస్టర్ బ్రౌన్ పేరిట ఉన్న లిస్ట్ ఏ మ్యాచుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును జగదీశన్ బద్దలు కొట్టాడు.
విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన జగదీశన్.. లిస్ట్ ఏ మ్యాచుల్లో వరుసగా 5 సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఆంధ్రాపై 114 నాటౌట్, ఛత్తీస్గఢ్పై 107, గోవాపై 168, హర్యానాపై 128 పరుగులు చేసిన జగదీశన్.. అరుణాచల్ప్రదేశ్పై 277 నాటౌట్గా నిలిచారు. వరుస సెంచరీలతో ప్రపంచంలో కుమార సంగక్కర, అల్విరో పీటర్సన్, దేవదత్ పడిక్కల్ను దాటేశాడు. అలాగే, మన దేశంలోని విరాట్ కోహ్లీ, పృథ్వీషాను వెనక్కి నెట్టేశాడు. 2008-09 ట్రోఫీలో కోహ్లీ నాలుగు సెంచరీలు చేశాడు. దీంతో ఒక వరల్డ్ రికార్డుతో పాటు రోహిత్శర్మ అత్యధిక పరుగులను రికార్డును అధిగమించి సెలెక్టర్ల దృష్టిలో పడిపోయాడు.