దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు మెగాటోర్నీని నిర్వహించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. కరోనా రెండో వేవ్ కారణంగా పొట్టి వరల్డ్కప్ వేదికను భారత్ నుంచి యూఏఈ, ఒమన్కు తరలిస్తున్నట్టు పేర్కొంది. అయితే వేదిక మారినా భారత క్రికెట్ నియంత్రణ మండలే (బీసీసీఐ) టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. ప్రపంచకప్ను యూఏఈకి తరలించేందుకు సిద్ధమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించిన మరుసటి రోజే ఐసీసీ అధికారికంగా నిర్ణయాన్ని వెల్లడించింది. ‘టీ20 ప్రపంచకప్ను అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు దుబాయ్, అబుదాబి, షార్జా, ఒమన్ వేదికలుగా జరుపుతాం.
బీసీసీఐ ఆతిథ్యహోదా అలాగే ఉంటుంది’ అని ఐసీసీ ప్రకటించింది. బీసీసీఐ, యూఏఈ, ఒమన్ క్రికెట్ బోర్డులతో పని చేసి క్రికెట్ పండుగను అభిమానులు సురక్షితంగా ఆస్వాదించేలా కృషి చేస్తామని ఐసీసీ తాత్కాలిక సీఈవో జెఫ్ అలార్ డైస్ పేర్కొన్నారు. కాగా ప్రపంచకప్ సూపర్ 12 దశకు 8 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగిలిన నాలుగు స్థానాల కోసం బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్, పపువా న్యుగినియా టీమ్లు తలపడతాయి. అక్టోబర్ 17న మొదలయ్యే ఈ ప్రాథమిక గ్రూప్ పోటీల్లో టాప్లో నిలిచిన నాలుగు జట్లు.. సూపర్ 12 దశకు చేరుకుంటాయి.
నాకౌట్ మ్యాచ్ల అనంతరం నవంబర్ 14న ఫైనల్ ఫైట్ ఉంటుంది. మరోవైపు ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన 31 మ్యాచ్లు సైతం యూఏఈలోని మూడు వేదికల్లో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 15 వరకు జరుగనున్నాయి. దీంతో మెగాటోర్నీ కోసం ఆటగాళ్ల రవాణా, బయోబబుల్ ఏర్పాట్లు సులువవుతాయని ఐసీసీ భావిస్తున్నది.