ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. పెద్దగా కొత్త నిర్ణయాలేమీ లేకుండా ఆసియా కప్ ఆడిన జట్టునే కంటిన్యూ చేశారు. గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా, హర్షల్ పటేల్ను కూడా ఎంపిక చేశారు. అయితే బీసీసీఐ ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో చివరికి 11 మందిలో తేలేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
మోకాలి గాయంతో రవీంద్ర జడేజా జట్టుకు దూరమవడంతో రిషభ్ పంత్ ఒక్కడే లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్గా ఉన్నాడు. అయితే అతను పొట్టి ఫార్మాట్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మాజీ స్టార్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఎత్తిచూపాడు. భారత బ్యాటింగ్లో తొలి నాలుగు స్థానాలు చాలా బలంగా ఉన్నాయని, అలాగే లోయర్ ఆర్డర్ కూడా పటిష్టంగా ఉందని చెప్పాడు.
టాపార్డర్లో రోహిత్, రాహుల్, విరాట్, సూర్యకుమార్ ఉండగా.. లోయర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్ ఉన్నారు. అయితే మధ్యలో ఐదో స్థానం మాత్రం జట్టుకు ప్రశ్నార్థకంగా మారిందన్నాడు ఊతప్ప. ‘ఐదో స్థానంలో పంత్ను ఆడించాలా? లేక దీపక్ హుడాను ఆడించాలా? అనేదే సమస్య. మిగతా బ్యాటింగ్ అంతా బలంగానే ఉంది. బౌలింగ్లో చాహల్, అశ్విన్, అక్షర్ ముగ్గురూ తెలివైన బౌలర్లే.
పేస్లో బుమ్రా, భువీతోపాటు హర్షల్ను తీసుకోవాలా? లేక ఎడంచేతి వాటం సీమర్ ప్రాముఖ్యత దృష్ట్యా అర్షదీప్ను ఆడించాలా? అనేది కూడా కొంత ఆలోచించాలి. డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే అర్షదీప్.. ఆస్ట్రేలియాలో కూడా రాణిస్తాడని నా నమ్మకం’ అని ఊతప్ప వివరించాడు. మరి ఆడే 11 మందిలో ఎవరు చోటు దక్కించుకుంటారో తెలియాలంటే వచ్చే నెల 24వ తేదీ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.