T20 World Cup | భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది. టీ20 ఫార్మాట్లో కోహ్లీ కెప్టెన్సీకి, భారత కోచ్గా రవిశాస్త్రికి చివరి మ్యాచ్ ముగిసింది. టీ20 ప్రపంచకప్లో నమీబియాతో జరిగిన ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ విన్నింగ్ రన్స్ చేయగానే.. కోహ్లీ, రవిశాస్త్రి ఒకరినొకరు కౌగిలించుకొని అభినందించుకున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
పొట్టి ఫార్మాట్లో కెప్టెన్గా కోహ్లీకి ఇది చివరి మ్యాచ్కాగా, టీమిండియా కోచ్గా రవిశాస్త్రికి కూడా ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత భారత మాజీ దిగ్గజం రాహుల్ ద్రవిడ్.. టీమిండియా కోచ్ పగ్గాలు అందుకోనున్నాడు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ గెలిచిన తర్వాత జట్టు శిబిరంలో అందరూ ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషం పంచుకోవడం పరిపాటే. కానీ నమీబియా మ్యాచ్లో కోహ్లీ, రవిశాస్త్రి కౌగిలించుకోవడం ప్రత్యేకం.
అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ ఇద్దరి హయాంలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదనే మాట వాస్తవమే. కానీ ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన శక్తుల్లో ఒకటిగా టీమిండియా ఎదిగిన మాట కూడా వాస్తవమే. ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ టెస్టు సిరీస్ గెలిచిన తొలి కోచ్, కెప్టెన్ జోడీ వీరిదే.
న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో టీ20 సిరీస్లు గెలిచిన ఘనత వీరికి దక్కింది. అయితే ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గలేదనే అసంతృప్తితోనే రవిశాస్త్రి, కోహ్లీ శకం ముగిసింది. ఈ క్రమంలోనే ఐసీసీ కూడా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీరిద్దరూ కౌగిలించుకున్న వీడియోను షేర్ చేసింది.