Afghanistan : ఒకపక్క ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తీవ్రంగా కొనసాగుతుంటే మరోపక్క పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. గురువారం ఆఫ్ఘన్పై పాక్ దాడి చేస్తే.. శుక్రవారం పాకిస్తాన్పై ఆఫ్ఘన్ దాడి చేసింది. పాకిస్తాన్, ఖైబర్ పంక్తుంఖ్వాలోని ఆర్మీ కేంద్రాలపై శుక్రవారం వైమానిక దాడులు జరిపినట్లు ఆప్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది.
ఈ దాడుల్లో పాకిస్తాన్కు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని వెల్లడించింది. పాకిస్తాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు తెలిపింది. పాకిస్తాన్ గురువారం రాత్రి ఆఫ్ఘన్లోని కొన్ని స్థావరాలపై దాడి చేసింది. ఆఫ్ఘన్ తీవ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు పాక్ తెలిపింది. ఈ దాడుల్లో సాధారణ పౌరులు మరణించినట్లు ఆఫ్ఘన్ తెలిపింది. దీంతో తాము కోహట్ ఏరియాలోని పాకిస్తాన్కు చెందిన కీలక స్తావరాలపై దాడి చేశామని తెలిపింది. దురంద్ లైన్ వద్ద వార్ కమాండ్ సెంటర్, ఫోర్ట్ కమాండర్లే లక్ష్యంగా ఈ దాడి చేశామని చెప్పింది. దాడుల ద్వారా ఇక్కడి నివాస ప్రాంతాల్ని కూడా ధ్వంసం చేసినట్లు ఆప్ఘన్ వివరించింది. తీవ్రవాద సమస్య కారణంగా పాక్, ఆఫ్ఘన్ పరస్పర దాడులకు దిగుతున్నాయి. తమ దేశంలోకి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదుల్ని పంపి విధ్వంసం సృష్టిస్తోందని పాక్ ఆరోపిస్తోంది.
ఈ ఆరోపణల్ని ఆఫ్ఘన్ నేతలు ఖండిస్తున్నారు. పాక్లోని భద్రతా వైఫల్యం వల్లే ఆ దేశంలో దాడులు జరుగుతున్నాయని తెలిపింది. రెండు దేశాల మధ్య ఉన్న 2,600 కిలోమీటర్ల పొడవైన దురండ్ లైన్ వెంబడి ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. బ్రిటీష్ కాలం నాడు ఏర్పర్చిన ఈ సరిహద్దును ఆఫ్ఘన్ అంగీకరించడం లేదు. ఇలాంటి అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య విబేధాలున్నాయి.