T20 World Cup | టీ20 ప్రపంచకప్ భారత క్రికెట్ అభిమానులకు చేదు అనుభవాలే మిగిల్చింది. 2012 తర్వాత తొలిసారి ఒక ఐసీసీ టోర్నీ సెమీస్కు అర్హత సాధించలేకపోవడం, ప్రపంచకప్ పోరులో మొట్టమొదటిసారి చిరకాల ప్రత్యర్థి పాక్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం ఇవన్నీ సగటు భారత జట్టు అభిమానికి నిద్రపట్టకుండా చేశాయి.
ఈ ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినప్పటి నుంచి జట్టు ఎంపికపై పలువిమర్శలు వచ్చాయి. వీటిపై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. భారత జట్టు ఎంపిక సరిగా జరగలేదంటూ అడిగిన ప్రశ్నకు రవిశాస్త్రి బదులిచ్చాడు.
భారత జట్టును ఎంపిక చేసేది బీసీసీఐ సెలెక్టర్లే అని స్పష్టంచేశాడు. జట్టు ఎంపికలో కోచ్, కెప్టెన్కు ఎటువంటి హక్కు ఉండదని చెప్పాడు. ‘ఆడే 11 మందిని ఎంచుకోవడంలోనే కోచ్ జోక్యం చేసుకుంటాడు. కాబట్టి 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన వాళ్లు కూడా బాధ్యత వహించాల్సిందే’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.