న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్లో వరుసగా రెండో మ్యాచ్లో కూడా ఘోరంగా ఓడిపోయిన టీమిండియాపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత జట్టులో నైపుణ్యం ఉన్నప్పటికీ మానసిక స్థైర్యం లేకపోవడం వల్లే ఇలా ఓటములు మూటగట్టుకోందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
టోర్నీ ఓపెనర్లో చిరకాల ప్రత్యర్థి పాక్ చేతిలో పది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన భారత్.. న్యూజిల్యాండ్పై దెబ్బతిన్న పులిలా దూకుతుందని అంతా భావించారు. కానీ ఈ మ్యాచ్లో అంతకంటే ఘోరంగా జట్టు చతికిలపడింది. బ్యాట్స్మెన్ అందరూ వచ్చినట్లే వచ్చి పెవిలియన్ చేరగా ఎలాగో ఆలౌట్ ప్రమాదాన్ని తప్పించుకున్న టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. బలమైన న్యూజిల్యాండ్కు ఇది అసలు ఒక లక్ష్యమే కాదు.
ఈ నేపథ్యంలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి 33 బంతులు మిగిలుండగానే కివీస్ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలోనే మాట్లాడిన గంభీర్.. ‘నిజమే, ట్యాలెంట్ ఉంది. మన దగ్గర అద్భుతమైన నైపుణ్యాలున్నాయి. అందుకే ద్వైపాక్షిక సిరీస్లో గట్రాలో అద్భుతంగా ఆడతాం. అదంతా ఒక ఎత్తు కానీ, ఇలాంటి మ్యాచ్లు, టోర్నీలు వచ్చినప్పుడు అక్కడ నిలబడి మంచి ప్రదర్శన చేయాలి’ అని గంభీర్ అన్నాడు.
న్యూజిల్యాండ్తో మ్యాచ్ ఒక విధంగా క్వార్టర్ ఫైనల్స్ వంటిదని చెప్పిన అతను.. టీమిండియా మానసిక స్థైర్యంతోనే సమస్య అని అభిప్రాయపడ్డాడు. ‘సడెన్గా ఈ మ్యాచ్ చాలా ముఖ్యమని, తప్పులు చేయకూడదని తెలిసినప్పుడే సమస్య. ద్వైపాక్షిక సిరీసుల్లో తప్పులు చేయొచ్చు. కానీ ఇలాంటి మ్యాచ్లలో అది కుదరదు. నాకు తెలిసి భారత జట్టు దగ్గర అలాంటి మానసిక బలం లేదు’ అని విమర్శించాడు.
భారత జట్టు చాలా శక్తిమంతమైనదని గంభీర్ అన్నాడు. ‘జట్టు సరిగా ఆడలేకపోతున్నప్పుడు వారికి అండగా ఉండాలని ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఐసీసీ టోర్నీల్లో చాలా ఏళ్లుగా భారత జట్టు ప్రదర్శన ఇలాగే ఉంది. అది సెమీఫైనల్స్ అయినా, న్యూజిల్యాండ్ మ్యాచ్ అయినా.. తప్పనిసరిగా ఎవరో ఒకరు నిలబడి ఆడాల్సిన తరుణంలో వాళ్లు అది కూడా చేయలేకపోయారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
గత వన్డే ప్రపంచకప్లో సెమీస్లో ఓడిన భారత్, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఓడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ మూడు మ్యాచ్లూ గెలవడంతోపాటు, గ్రూప్-2లో ఏవో అద్భుతాలు జరిగితే తప్ప టీమిండియా సెమీస్ చేరడం సాధ్యం కాదు.