దుబాయ్: టీ20 ప్రపంచకప్లో అత్యంత ఘోరంగా ఆడుతున్న టీమిండియాపై పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ టోర్నీలను భారత్ సీరియస్గా తీసుకోవడం లేదని, కేవలం ఐపీఎల్ ఆడితే చాలని భారత్ భావిస్తోందని దుయ్యబట్టాడు. తన వాదనకు సరిపోయే ఆధారాలను కూడా వసీం చూపడంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
భారత జట్టు పూర్తి స్థాయిలో చివరగా ఆడిన సిరిస్ ఏదో తెలుసా? మార్చి నెలలో ఇంగ్లండ్తో ఆడిన వన్డే, టీ20 సిరీస్. ఇదే విషయాన్ని వసీం అక్రమ్ కూడా ప్రస్తావించాడు.
‘భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో చివరగా పూర్తి స్థాయిలో ఆడింది మార్చి నెలలో, ఇది నవంబరు. ఇప్పటి వరకూ అందరు ఆటగాళ్లూ కలిసి ఒక్క అంతర్జాతీయ టోర్నీ కూడా ఆడలేదు. దీన్నిబట్టే అంతర్జాతీయ క్రికెట్ను భారత్ ఎంత సీరియస్గా తీసుకుంటుందో అర్థమైపోతోంది’ అని అక్రమ్ విమర్శించాడు.
జూలై నెలలో శ్రీలంకలో భారత జట్టు ఆడినప్పటికీ, ఆ జట్టులో సీనియర్ ప్లేయర్లెవరూ లేని సంగతి తెలిసిందే. ప్రధాన ఆటగాళ్లు లేకుండా యువజట్టును శ్రీలంకకు పంపింది భారత్. ఆ వెంటనే ఆటగాళ్లంతా యూఏఈ వచ్చి ఐపీఎల్లో ఆడారు. అనంతరం టీ20 ప్రపంచకప్ మొదలైపోయింది. లీగ్ మ్యాచ్లు ఎన్ని ఆడిన అంతర్జాతీయ మ్యాచ్తో సమానం కాదని అక్రమ్ చెప్పాడు.
‘లీగ్ దశలో ఒకరో ఇద్దరో నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొంటాం. అంతర్జాతీయ క్రికెట్లో ఐదుగురు అద్భుతమైన బౌలర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అక్రమ్ అన్నాడు. అలాగే న్యూజిల్యాండ్తో మ్యాచ్లో రోహిత్ను మూడో స్థానంలో దింపడాన్ని కూడా తప్పుబట్టాడు. ‘టీ20 క్రికెట్లో మూడు సెంచరీలు చేసిన ఓపెనర్ను ఇలాంటి కీలకమైన మ్యాచ్లో మూడో స్థానంలో దింపుతారా? ఇషాన్ కిషన్నే ఆ స్థానంలో దింపొచ్చు కదా‘ అని అక్రమ్ విమర్శలు చేశాడు.
న్యూజిల్యాండ్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ పూర్తి విఫలమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత టీమిండియా సెమీస్ అవకాశాలు దాదాపు ఆవిరైనట్లే. ఈ క్రమంలోనే భారత జట్టు మనస్తత్వాన్ని, తప్పుడు నిర్ణయాలను అభిమానులే కాక, మాజీలు కూడా తప్పుబడుతున్నారు.