SuryaKumar Yadav : దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడిన భారత జట్టు టీ20 కొత్త సారథి సూర్యకుమార్ యాదవ్(SuryaKumar Yadav) కోలుకుంటున్నాడు. ఎడమ కాలిమడిమ(Ankle)కు పగుళ్లు ఏర్పడడంతో అతడు కాలికి పట్టి వేసుకున్నాడు. కర్ర సాయంతో నడుస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. అందులో సూర్య.. ‘కొంచెం సీరియస్గానే చెప్తున్నా.. గాయాలు ఎప్పుడూ నవ్వు తెప్పించవు. అయితే.. నేను త్వరలోనే కోలుకొని ఫిట్గా అవుతా. మరింత స్ట్రాంగ్గా తిరిగొస్తాను’ అని అన్నాడు.
వరల్డ్ కప్ అనంతరం టీ20 పగ్గాలు చేపట్టిన సూర్య తొలి సిరీస్లోనే సక్సెస్ అయ్యాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా(Australia)పై అదరగొట్టిన సూర్య.. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ నిరూపించుకున్నాడు. జొహన్నెస్బర్గ్(Johannesberg)లో జరిగిన సిరీస్ డిసైడర్లో శతకంతో విరుచుకపడిన ఈ 360 ప్లేయర్.. పొట్టి ఫార్మాట్లో నాలుగో సెంచరీతో రికార్డు సృష్టించాడు.
అయితే.. అదే మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా అతడి ఎడమ కాలిమడమ మడత పడింది. దాంతో, మైదానం వీడిన సూర్యకు స్కానింగ్ పరీక్షలు చేయగా.. కాలిమడమలో పగుళ్లు వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. దాంతో, సూర్య ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు కోలుకునేందుకు మరో 20 రోజుల పైనే పట్టనుంది. అదే జరిగితే.. వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో అఫ్గనిస్థాన్ సిరీస్కు సూర్య దూరం అయ్యే చాన్స్ ఉంది.