సంచలనాలకు నెలవుగా మారిన టీ20 ప్రపంచకప్లో.. ఆఖరి రోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కచ్చితంగా సెమీస్ చేరుతుందనుకున్న దక్షిణాఫ్రికా.. గ్రూప్ దశతోనే ఇంటిబాట పడితే.. అనూహ్యంగా రేసులోకి వచ్చిన పాకిస్థాన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఖంగుతినగా.. బంగ్లాపై విజయంతో పాకిస్థాన్ ముందంజ వేసింది. అప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్ చివరి మ్యాచ్లో జింబాబ్వేపైగెలిచి గ్రూప్2లో అగ్రస్థానందక్కించుకుంది.
కిక్కిరిసిన మైదానంలో సూర్యకుమార్ కదం తొక్కిన వేళ.. చివరి మ్యాచ్లో జింబాబ్వేపై టీమ్ఇండియా జయభేరి మోగించింది. కేఎల్ రాహుల్ వేసిన పునాదిపై సూర్యకుమార్ ఆకాశహార్మ్యాన్ని నిర్మించగా.. ఛేదనలో జింబాబ్వే లక్ష్యానికి చాలా దూరంలోనే ఆగిపోయింది. గ్రూప్ దశలో ఐదు మ్యాచ్ల్లో నాలుగింట నెగ్గి టాప్లో నిలిచిన రోహిత్ సేన.. గురువారం జరుగనున్న రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.
సెమీస్ చేరిన టీమ్ఇండియా
మెల్బోర్న్: పొట్టి ప్రపంచకప్లో సూపర్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మరో అద్భుత అర్ధశతకంతో రాణించడంతో టీమ్ఇండియా గ్రూప్-2 టాపర్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై నెగ్గి సెమీస్కు దూసుకెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగుల చేసింది. కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. విరాట్ కోహ్లీ (26), హార్దిక్ పాండ్యా (18), రోహిత్ శర్మ (15) ఎక్కువసేపు నిలువలేకపోయారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం చేజింగ్లో జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. ర్యాన్ బుర్ల్ (35), సికందర్ (34) కాస్త పోరాడారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూర్యకుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. తొలి సెమీఫైనల్లో బుధవారం న్యూజిలాండ్తో పాకిస్థాన్ తలపడనుంది.
ఆహా.. ఏమా ఆట..
జింబాబ్వేతో ఆదివారం మ్యాచ్ చూసిన వారంతా సూర్యకుమార్ ఆడిన షాట్లకు ఆశ్యర్చపోక మానరు. 82,507 మందితో కిటకిటలాడిన మెల్బోర్న్ మైదానంలో సూర్య.. నలువైపులా షాట్లు ఆడి స్టేడియాన్ని మోత మోగించాడు. కట్ షాట్, స్ట్రయిట్ డ్రైవ్ వంటి సంప్రదాయ షాట్లతో పాటు ల్యాప్, స్కూప్ వంటి విభిన్నమైన షాట్లతో బంతిని బౌండ్రీ దాటించాడు. ఆరంభంలో రాహుల్ ధాటిగానే ఆడినా.. రోహిత్, కోహ్లీ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చకపోవడంతో భారత్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే సూర్యకుమార్ చివర్లో గేర్లు మార్చుతూ జింబాబ్వే బౌలర్లను చీల్చి చెండాడటంతో భారత్ చివరి 5 ఓవర్లలో 79 పరుగులు పిండుకుంది. 360 డిగ్రీస్ ప్లేయర్ అన్న పేరుకు తగ్గట్లు వికెట్ నలువైపులా షాట్లు ఆడిన సూర్యకుమార్.. పొట్టి ఫార్మాట్లో తనకు నంబర్వన్ ర్యాంక్ ఎలా దక్కిందో బ్యాట్తో చాటిచెప్పాడు.
1 ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగులు చేసిన తొలి ఆటగాడిగా సూర్యకుమార్ (1026) రికార్డుల్లోకెక్కాడు. మహమ్మద్ రిజ్వాన్ (924), విరాట్ కోహ్లీ (731) అ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
4 ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరడం టీమ్ఇండియాకు ఇది నాలుగోసారి గతంలో 2007, 2014, 2016లో భారత్ సెమీస్ చేరింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 186/5 (సూర్యకుమార్ 61 నాటౌట్, రాహుల్ 51; విలియమ్స్ 2/9), జింబాబ్వే: 17.2 ఓవర్లలో 115 ఆలౌట్ (ర్యాన్ బ్రుల్ 35; అశ్విన్ 3/22, షమీ 2/14).
సెమీఫైనల్-1
న్యూజిలాండ్ x పాకిస్థాన్
బుధవారం, సిడ్నీ
సెమీపైనల్-2
భారత్ x ఇంగ్లండ్
గురువారం, అడిలైడ్