“ఎన్సీఏలో కొద్దివారాల క్రితమే ఓ వ్యక్తిని కలిశాను. అతడు చిన్న గాయం నుంచి కోలుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. ఆ కుర్రాడు పూర్తిగా తన రికవరీ మీదే దృష్టి సారించి కఠినంగా శ్రమిస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. అక్కడున్న ఒక కోచ్ నాతో.. ‘అతడు మారిన మనిషి’ అని చెప్పాడు. అవును.. ఇప్పుడు నేను దానిని స్వయంగా ఆస్వాదిస్తున్నా.. రియాన్ పరాగ్ 2.0” టీ20లలో వరల్డ్ నంబర్వన్ బ్యాటర్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ గురువారం రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్లో రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత చేసిన ట్వీట్ అది. అవును.. పరాగ్ ఇప్పుడు మారిన మనిషి..!
Riyan Parag | ఐపీఎల్లో బహుశా రియాన్ పరాగ్ ఎదుర్కొన్నంత ట్రోలింగ్ మరే క్రికెటర్ అనుభవించలేదంటే అతిశయోక్తి కాదేమో. 17 ఏండ్ల వయసులోనే (2019లో) ఈ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన పరాగ్.. ఆట కంటే ఎక్కువ ‘అతి’ తోనే ట్రోలర్స్కు, మీమ్ పేజీలకు సరుకుగా మారాడు. ఎక్స్ (ట్విటర్)తో పాటు మీడియాలో అతడు ఏం మాట్లాడినా నెటిజన్లు ఆటాడుకునేవాళ్లు. ‘ఆట కంటే అటిట్యూడ్ ఎక్కువ’ అంటూ పరాగ్పై సోషల్ మీడియా ముద్ర వేసింది. వాళ్ల విమర్శలకు తగ్గట్టు ఫీల్డ్లో ఈ అస్సాం కుర్రాడి వ్యవహార శైలి పలుమార్లు వివాదాస్పదమైంది. గత సీజన్లో దారుణంగా విఫలమైన (7 మ్యాచ్లలో 78 రన్స్) అతడిని రాజస్థాన్ అనవసరంగా భరిస్తుందని, వేలానికి వదిలేయడం ఉత్తమమని ఉచిత సలహాలూ ఇచ్చిన వారూ లేకపోలేదు. అంతకుముందు మూడు సీజన్లలో (183, 93, 86)నూ ఆ జట్టుకు ఆడిన దాదాపు మొత్తం మ్యాచ్లలో ఉన్న పరాగ్.. తన మార్కును చూపలేకపోయాడు.
గతమెలా ఉన్నా ఐపీఎల్-17 లో ఆడిన రెండు మ్యాచ్ల ద్వారా పరాగ్ ఎంతో మెరుగయ్యాడనేది అతడి ఆటను చూసినవారికి అనిపించక మానదు. 2023 సీజన్ దాకా రాజస్థాన్ అతడిని ఫినిషర్గానే వాడింది. కానీ ఈ సీజన్లో అతడు నాలుగో స్థానంలోకి ప్రమోషన్ పొందాడు. లక్నోతో జరిగిన తొలి మ్యాచ్లో ఆ జట్టు 49 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్కు వచ్చి శాంసన్తో మూడో వికెట్కు కీలకమైన 92 పరుగులు జోడించాడు. ఢిల్లీతోనూ రాజస్థాన్ కష్టాల్లో (36/3) ఉన్నప్పుడే వచ్చి బౌలర్లు విజృంభిస్తున్న వేళ ఓపికగా ఆడాడు. తొలి 26 బంతుల్లో అతడు చేసింది 26 పరుగులే. కానీ 15 వ ఓవర్ తర్వాత మొదలైన విధ్వంసం నోకియా వేసిన చివరి ఓవర్లో శిఖరాగ్రానికి చేరింది. ఇంతవరకూ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఓ కుర్రాడు.. అగ్రశ్రేణి బౌలర్గా ఉన్న నోకియా బౌలింగ్లో 25 పరుగులు రాబట్టాడు. నోకియా 144 కిలోమీటర్ల వేగంతో వేసిన బౌన్సర్ను దీటుగా ఎదుర్కొని డీప్ మిడ్వికెట్ మీదుగా సిక్సర్ బాదిన షాట్ను చూసి తీరాల్సిందే. 26 బంతుల వరకూ బాల్కు ఒక్క పరుగు అన్నట్టుగా చేసిన పరాగ్.. 45 బంతుల్లో 84 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఈ రెండు మ్యాచ్లలోనూ పరాగ్ పరిణితితో కూడిన ఇన్నింగ్స్లు ఆడాడు. ఢిల్లీతో మ్యాచ్లో బౌలర్లు విజృంభిస్తున్న వేళ వికెట్ను కాపాడుకున్న అతడు.. ఆఖర్లో జూలు విదిల్చి తన జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఆటతో పాటు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పరాగ్ మాట్లాడే తీరులోనూ పరిణితి కనిపించింది. పరిస్థితులకు తగ్గట్టుగా అతడు తన ఆటను మలుచుకున్న తీరు ప్రశంసనీయం.