Suresh Raina : నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai super kings) ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023) ఫైనల్లో అడుగుపెట్టింది. సీఎస్కే పదోసారి ఐపీఎల్ టైటిల్ పోరులో నిలవడం పట్ల ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా సంతోషం వ్యక్తం చేశాడు. టోర్నీ ఆసాంతం చెన్నైని అద్భుతంగా నడిపించిన మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)ని అతను ఆకాశానికెత్తేశాడు. జడేజా, దీపక్ చాహర్ తప్పించి జట్టులో స్టార్ బౌలర్లు లేకపోయినా సీఎస్కేను ఫైనల్కు చేర్చిన మహీపై ప్రశంసలు కురిపించాడు.
‘ధోనీ ముట్టకున్న ప్రతీది బంగారమవుతుంది. ధోనీ ప్రతి విషయాన్ని చాలా సులువుగా మార్చుతాడు. యావత్ భారతదేశం మొత్తం ధోనీ ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని కోరుకుంది’ అని రైనా వెల్లడించాడు. ఏమంత అనుభవం లేని మహీశ్ థీక్షణ, మథీశ పథిరన(శ్రీలంక), తుషార్ దేశ్పాండే వంటి బౌలర్లపై నమ్మకం ఉంచి, వాళ్లను మ్యాచ్ విన్నర్లుగా మార్చాడు. తెలివైన వ్యూహాలతో, సరైన సమయంలో బౌలింగ్ మార్పులతో ధోనీ ఫలితాలు రాబట్టాడు.
గత సీజన్లో దారుణ ప్రదర్శనతో 9వ స్థానంలో నిలిచిన ధోనీ సేన ఈసారి రెండో స్థానం సాధించింది. ఒక్క ఏడాదిలో జట్టు కూర్పు, ఆటగాళ్ల ఆట తీరు మారడం వెనక ధోనీ తన మార్క్ చూపించాడు. అందుకు ఉదాహారణ వీళ్లే.. కెరీర్ ఇక ముగిసింది అనుకున్న అజింక్యా రహానేకు దన్నుగా నిలిచాడు. యంగ్స్టర్ శివం దూబే సిక్సర్ల దూబేగా మారడం వెనక ధోనీ ఉన్నాడు. జట్టులో సహృదయ వాతావరణం ఉండేలా చూసి, ఆటగాళ్ల శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన ధోనీ సీఎస్కేను చాంపియన్ టీమ్గా తయారుచేశాడు. ఈ నేపథ్యంలోనే రైనా ధోనీ ఏదీ ముట్టుకున్నా అది బంగారమైతుంది అని అన్నాడు.
గుజరాత్పై గెలిచి ఫైనల్ చేరిన సీఎస్కే
ఐపీఎల్లో విజయవంతైమన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో పదోసారి ఫైనల్కు చేరింది. నిన్న రాత్రి చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్ 1 గేమ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 12 సార్లు చెన్నైని ప్లే ఆఫ్స్కు తీసుకెళ్లిన అతను క్వాలిఫైయర్ 1లో తన అనుభవాన్నంతా ఉపయోగించాడు. పెద్దగా అనుభవం లేని బౌలింగ్ దళంతో ఈ మిస్టర్ కూల్ మ్యాజిక్ చేశాడు. అనామకులైన థీక్షణ, ప్రథిరనను ఆయుధాలుగా ప్రయోగించి ఫలితం సాధించాడు.