సొంతగడ్డపై సన్రైజర్స్ సత్తాచాటింది. గత రెండు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్.. ఈ సారి సమిష్టిగా విజృంభించింది. ఉప్పల్ వేదికగా జరిగిన పోరులో మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో పంజాబ్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన రైజర్స్.. ఆనక ఓ మాదిరి లక్ష్యాన్ని 17 బంతులు మిగిలుండగానే ఛేదించి పాయింట్ల ఖాతా తెరిచింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. గత మ్యాచ్ల్లో బ్యాటింగ్ వైఫల్యాలతో పరాజయాలు ఎదుర్కొన్న రైజర్స్.. ఆదివారం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధవన్ (66 బంతుల్లో 99 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. సహచరులంతా విఫలమైన చోట శిఖర్ ఒంటరి పోరాటంతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. శిఖర్తో పాటు సామ్ కరన్ (22) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగా.. ప్రభ్ సిమ్రన్ సింగ్ (0), షార్ట్ (1), జితేశ్ శర్మ (4), సికందర్ రజా (5), షారుక్ ఖాన్ (4) విఫలమయ్యారు.
హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే 4.. మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సన్రైజర్స్ 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (48 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్ (37 నాటౌట్; 6 ఫోర్లు) రాణించారు. శిఖర్ ధవన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 35 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్తో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో సన్రైజర్స్ పాయింట్ల ఖాతా తెరిచింది. సోమవారం జరుగనున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
పంజాబ్: 143/9 (ధవన్ 99 నాటౌట్; మయాంక్ మార్కండే 4/15, జాన్సెన్ 2/16), హైదరాబాద్: 17.1 ఓవర్లలో 145/2 (రాహుల్ త్రిపాఠి 74 నాటౌట్, మార్క్మ్ 37 నాటౌట్; అర్ష్దీప్ 1/20).