న్యూఢిల్లీ: ఫామ్ లేమితో తంటాలు పడుతున్న టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తిరిగి గాడిన పడేందుకు అవసరమైన సలహాలు ఇచ్చేందుకు తాను సిద్ధమేనని దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. పదే పదే ఆఫ్ స్టంప్కు దూరంగా వెళుతున్న బంతులను వెంటాడి ఔటవుతున్న విరాట్తో 20 నిమిషాలు చర్చిస్తే.. అది అతడికి ఎంతో ఉపయోగ పడుతుందని పేర్కొన్నాడు. తాజా ఇంగ్లండ్ సిరీస్లో కోహ్లీ నిరాశ పరిచిన నేపథ్యంలో సన్నీ మంగళవారం మాట్లాడుతూ.. ‘నేను అతడి (కోహ్లీ)తో 20 నిమిషాల మాట్లాడితే.. అతడేం చేయాలో చెప్పగలను.
ఆ సూచనలు అతడికి ఉపయోగపడొచ్చు. ముఖ్యంగా ఆ ఆఫ్ స్టంప్ లైన్ సంబంధించిన విషయంలో నా మాటలు అతడికి సహాయపడొచ్చు. ఓపెనర్గా ఆ లైన్తో ఇబ్బంది పడినందున ఈ మాట చెప్తున్నా. ఇటీవలి కాలంలో అతడి బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడంతో ప్రతి బంతిని కొట్టాలని ప్రయత్నించి విఫలమవుతున్నాడు’ అని అన్నాడు.
మరోవైపు ఆఖరి వన్డేలో అదరగొట్టిన రిషబ్ పంత్పై గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. గతంలో మాదిరిగా వికెట్ పారేసుకోకుండా పంత్ బాధ్యతాయుతంగా ఆడాడని కొనియాడాడు.