INDvsSA T20I: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం డర్బన్లోని కింగ్స్మీడ్ మైదానం వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. టాస్ వేయడానికి ముందే మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. అయితే మ్యాచ్ ముగిశాక టీమిండియా వెటరన్ సునీల్ గవాస్కర్ క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఎ)పై విమర్శలు గుప్పించాడు. గ్రౌండ్ను పూర్తిగా కవర్ చేసేందుకు కూడా దక్షిణాఫ్రికా బోర్డు దగ్గర డబ్బులు లేవా..? అని ప్రశ్నించాడు.
స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ ప్యానెల్లో ఉన్న సన్నీ, మ్యాచ్ రద్దు అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్కు దక్షిణాఫ్రికా బోర్డు సరిగ్గా సన్నద్ధమైనట్టు కనిపించడం లేదు. ఒకవేళ వర్షం ముగిసినా తొలి మ్యాచ్ మొదలయ్యేందుకు కనీసం రెండు గంటలైనా పట్టేది. సీఎస్ఎ వద్ద బీసీసీఐ దగ్గర ఉన్నంత డబ్బులు లేకపోవచ్చు. కానీ వాళ్ల దగ్గర కూడా సరిపడా నిధులున్నాయి. ప్రతి బోర్డు దగ్గర కావాల్సినన్ని నిధులున్నాయి. ఒకవేళ ఎవరైనా తమ దగ్గర చాలినన్ని నిధులు లేవని చెబితే అది అబద్ధమే అవుతుంది..’అని తెలిపాడు.
వర్షం కారణంగా కింగ్స్మీడ్ మైదానంలో పిచ్, థర్టీ యార్డ్ సర్కిల్కు మాత్రమే కవర్స్ కప్పి ఉంచడం సన్నీకి ఆగ్రహం తెప్పించింది. పిచ్తో పాటు థర్టీ యార్డ్ సర్కిల్కు మాత్రమే కవర్స్ కప్పి ఉంచితే కరెక్ట్ కాదని, ఔట్ ఫీల్డ్తో పాటు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసే ఫీల్డర్ల రక్షణను గాలికొదిలేయడం సరికాదని సన్నీ అభిప్రాయపడ్డాడు. మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనలలోని 10.2 చట్టం ప్రకారం మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తే, పిచ్ మొత్తాన్ని కవర్స్తో కప్పి ఉంచాలి. 10.2.2 నిబంధన ప్రకారం వీలైతే బౌలర్స్ రనప్ చేసే ప్రాంతాన్ని కూడా కవర్ చేయాలి.