హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ):అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న తైక్వాండో ప్లేయర్ సింధు తపస్విని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఇటీవల అమెరికా వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ తైక్వాండో టోర్నీలో రెండు రజతాలు, ఇంగ్లండ్ మాంచెస్టర్ టోర్నీలో కాంస్య పతకం నెగ్గిన సింధును మంత్రి మంగళవారం తన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికలపై రాణించడం అభినందనీయమన్నారు. తైక్వాండోలో రాష్ర్టానికి మరిన్ని పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీజీవో కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత, కోశాధికారి పుల్లెంల రవీందర్కుమార్ గౌడ్, కృష్ణమూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.